తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీ పెద్దలు ఈ వారంలో ఒక సమావేశం నిర్వహించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సింగిల్ ధియేటర్ల పరిస్థితి మరీ భయంకరంగా ఉండటంతో ఎగ్జిబిటర్స్ నిర్మాతలు కలిసి సినిమాలను ఓటీటీ కి ఇవ్వడం పై ఆంక్షలు విధించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగా చిన్న సినిమాలను ఒక నెల తరువాత పెద్ద సినిమాలు నెలన్నర తరువాత మాత్రమే ఓటీటీ లో ప్రదర్శించాలని అలా చేయకుంటే ఆ నిర్మాతలు తీసిన సినిమాలకు ధియేటర్లు ఇవ్వకుండా సహాయనిరాకరణ చేయాలని ఒక స్థిర నిర్ణయం తీసుకునే దశగా ఈ సమావేశం ఉండబోతోందని అంటున్నారు. ఈ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకోకపోతే ఇక భవిష్యత్ లో ధియేటర్లు నడపడం కష్టం అనీ ధియేటర్ల యజమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
10 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాలలో 3 వేల ధియేటర్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 16 వందలకు పడిపోయిందని ఇలాగే ఓటీటీ సినిమాల హవా కొనసాగితే మరో రెండు సంవత్సరాలకు ధియేటర్ల సంఖ్య 1000 లోపు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికే చాల ధియేటర్లు కరెంటు చార్జీలు కూడ కట్టలేని పరిస్థితిలో ఉండటంతో ఇక రానున్న రోజులలో ఒక మల్టీ ప్లెక్స్ ధియేటర్లు తప్ప సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మాయమైపోయే పరిస్థితి ఉంది అంటూ హెచ్చరికలు వస్తున్నాయి..