జెమిని టివి భారీ అంచనాలతో మొదలుపెట్టిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకు మొదట్లో చాల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రానురాను ఈషోకు క్రేజ్ తగ్గి రేటింగ్స్ కూడ బాగా తక్కువగా వస్తూ ఉండటంతో ఎలర్ట్ అయిన జెమిని టివి వర్గాలు ఈషో ఎపిసోడ్స్ సంఖ్యను కుదించి మహేష్ తో చేసిన స్పెషల్ షోతో ఈషోకు ముగింపు పలికారు.


అయితే నిన్న ప్రసారం అయిన ఈచివరి రోజు కార్యక్రమానికి అనూహ్యస్పందన వచ్చింది. మహేష్ ను జూనియర్ ఎన్టీఆర్ ‘అన్న’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఈకార్యక్రమాన్ని రక్తి కట్టించాడు. ఆంధ్రా హాస్పటల్స్ కు సహాయం చేయడానికి మహేష్ ఈషోలో వచ్చే తన డబ్బును వినియోగిస్తూ తన మంచి మనసు చాటుకున్నాడు. ఒకవైపు మహేష్ ను ‘అన్న’ అని పిలుస్తూనే జూనియర్ మహేష్ ను ప్రశ్నలతో ఆట పట్టడానికి ప్రయత్నించాడు.


ఎవరైనా ‘కురుక్షేత్రం’ సినిమాను రీమేక్ చేస్తే ఏపాత్ర మీరు వేస్తారు అంటూ జూనియర్ అడిగిన ప్రశ్నకు మహేష్ సమాధానం ఇస్తూ తన పై జోక్స్ ఎందుకు వేస్తున్నావు అంటూ సెటైర్ వేసాడు. అయితే జూనియర్ కృష్ణుడు పాత్రకు మీరు సరిపోతారు అంటే అన్ని కోట్లు ఖర్చుపెట్టి డబ్బు పోగొట్టుకునే నిర్మాత ఎక్కడ ఉన్నాడో వెతకమని జోక్ చేసాడు. ఇక తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ తనకు అన్ని విషయాలలోనూ రోల్ మోడల్ తన తండ్రి అని చెపుతూ తన తండ్రిలా సాహసాలు చేసే ధైర్యం తనకు లేదు అంటూ కామెంట్ చేసాడు.


తన తండ్రి లానే తనకు కూడ రకరకాల ఫుడ్స్ తినడం తనకు ఇష్టం అని చెపుతూ అయితే ప్రపంచంలో ఎన్నో అత్యంత ఖరీదైన రెస్టారెంట్స్ లో తాను ఫుడ్ తిన్నప్పటికీ తన అమ్ముమ్మ చేతి వంట లా తనకు రుచి కల్గించిన డిష్ ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు అంటూ తన అమ్ముమ్మ పై తన ప్రేమను చాటుకున్నాడు. మహేష్ జూనియర్ ల సాన్నిహిత్యానికి మంచి వారధిగా ప్రసారం అయిన ఈ ఎపిసోడ్ తో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకు వీడ్కోలు పలకడం జరిగింది..




మరింత సమాచారం తెలుసుకోండి: