లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ కెరీర్ బిగినింగ్లో మంచి హిట్స్ కొట్టారు. అయితే 'మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఇంటిలిజెంట్, ఎ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా' ఫ్లాపులతో లావణ్య కెరీర్ డల్ అయ్యింది. అలాగే అనుపమకి 'కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు' ప్లాపులతో బ్రేకులు పడ్డాయి. ప్రతీ శుక్రవారం ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వీళ్లలో చాలామంది ఒకటి రెండు సినిమాలతోనే ఇంటికెళ్లిపోతున్నారు. దీంతో మళ్లీ వేట మొదలవుతోంది. మరి ఆ వచ్చే వాళ్లు అయినా సరిగ్గా పెర్ఫామ్ చేస్తున్నారా అంటే స్కిన్షోకే పరిమితమవుతున్నారు. తక్కువ సమయంలో కనిపించకుండా పోతున్నారు.
'హలో' సినిమాతో పలకరించిన కళ్యాణి ప్రియదర్శన్ 'రణరంగం' ఫ్లాప్ తర్వాత మళ్లీ కనిపించలేదు. అలాగే బెస్ట్ పెర్ఫామర్ అనిపించుకున్న నివేదా థామస్ 'జై లవకుశ' తర్వాత పై చదువుల కోసం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ బ్రేక్ తర్వాత నివేదాకి మళ్లీ మునుపటి రేంజ్లో అవకాశాలు రావడం లేదు. రాశీ ఖన్నా బిగినింగ్లో బాగానే హడావిడి చేసింది. 'ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, తొలిప్రేమ' లాంటి సినిమాలతో జోరు చూపించింది. అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ తర్వాత రాశి తమిళ్కి వెళ్లిపోయింది. ఇక 'పెళ్లి చూపులు'తో ఓకే అనిపించుకున్న రీతూ వర్మకి 'కేశవ, టక్ జగదీష్' లాంటి ఫ్లాప్స్ పడ్డాయి. అలాగే 'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న నభా నటేశ్ని 'డిస్కోరాజా, అల్లుడు అదుర్స్' ఫ్లాపులు ముంచేశాయి.