సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. మహేష్ బాబు పాత్ర తో పాటు ఈ సినిమాలో ఆయన వేషధారణ, ఆహార్యం అంతా కూడా కొత్తగా ఉండనున్నట్లు టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఇటీవల మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకున్న మహేష్ ప్రస్తుతం దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలుకానుండగా దీనిని ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నారు. అయితే దీని తరువాత త్రివిక్రమ్ తో మహేష్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా మార్చి లో ప్రారంభం కానున్నట్లు టాక్. మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, చాలా గ్యాప్ తరువాత మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ హంగులతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగనుండగా ఇందులో ఒకప్పటి పాపులర్ సాంగ్ ని రీమిక్స్ చేయనున్నారట. 1978లో రంగనాథ్, లక్ష్మి ల కలయికలో తెరకెక్కిన పంతులమ్మ సినిమాలోని సిరిమల్లె నీవే అనే సాంగ్ అప్పట్లో ఎంతో పెద్ద హిట్ అయింది.

రాజన్ నాగేంద్ర సంగీతం అందించిన ఈ పాటకి వేటూరి లిరిక్స్ అందించగా ఎస్పీ బాలు దీనిని ఎంతో అద్భుతంగా ఆలపించారు. కాగా మహేష్, త్రివిక్రమ్ సినిమాలోని ఒక కీలక సందర్భంలో ఈ సాంగ్ రానుందని, త్వరలో దీనిని సంగీత దర్శకుడు థమన్ రీమిక్స్ కంపొజిషన్ చేయనున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలి అంటే యూనిట్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: