నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి ఎన్ శివప్రసాద్ దర్శకుడు. ఇక విడుదల తరువాత ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో పాటు నటిగా రోజాకు బాగా పేరు తెచ్చిపెట్టింది. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ కోసం అనేకమందిని అన్వేషించిన దర్శకుడు శివప్రసాద్, ఫైనల్ గా ఒకచోట రోజాని చూసి తప్పకుండా ఆమెనే తన మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని భావించి వెతుక్కుని వెళ్ళి ఆమెని ఎంపిక చేశారట. ఆ విధంగా తనకు నటిగా అవకాశం ఇచ్చిన శివప్రసాద్ ని ఎప్పుడూ తన పాలిట దైవంగా భావిస్తారు రోజా.
ఇక తన ఇంటర్వ్యూస్ లో భాగంగా శివ ప్రసాద్ గురించి ఎంతో గొప్పగా చెప్పే రోజా, ఇటీవల రాజకీయ ప్రవేశం అనంతరం తాను వైసిపిలో అలానే శివప్రసాద్ టిడిపిలో ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ ఆయన మీద ఒక్క విమర్శని కూడా ఆమె చేయకపోవడం గమనార్హం. తనకి ఫస్ట్ సినిమా దర్శకుడిగా అవకాశం ఇవ్వడం మాత్రమే కాదని, తన సొంత బిడ్డలా శివప్రసాద్ గారు తనని చూసుకునేవారని తరచు పలుసందర్భాల్లో వెల్లడించిన రోజా, ఇటీవల ఆయన మరణ సమయంలో ఎంతో కన్నీటిపర్యంతం అయ్యారని, ఆయన లేని లోటు నిజంగా పూడ్చలేనిదని, ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శివప్రసాద్ కుటుంబసభ్యులకు రోజా ధైర్యం చెప్పారని ఆమె సన్నిహితులు చెప్పడం జరిగింది.