కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ కోరలు చాస్తోంది. సెకండ్‌ వేవ్‌లో డెల్టా వేరియంట్‌ రూపంలో వచ్చిన కరోనా.. ఇప్పుడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో మరింత బలం పుంజుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో కరోనా థర్డ్‌ వేవ్‌ అని చెప్పక తప్పని పరిస్థితి. తొలుత రోజుకు పదుల సంఖ్యలో మాత్రమే కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పుడవి వందలు, వేలు దాటి లక్షల్లో నమోదు అవుతుండటంతో అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.

కరోనాకు పేద- ధనిక, సామాన్యుడు- సెలబ్రిటీ అనే తేడా లేదు. ప్రస్తుతం థర్డ్‌ వేవ్ పుంజుకోవడంతో సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు సైతం కరోనా వైరస్‌ సోకుతుండటం జరుగుతోంది. ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో మహేశ్‌ బాబు, హీరో నితిన్‌ సతీమణి షాలిని, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, యువ హీరో విశ్వక్సేనా, సంగీత దర్శకుడు థమన్‌సహా మరికొందరు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న వీరి ఆరోగ్యం బాగానే ఉంది వారివారి కుటుంబీకుల ద్వారా తెలుస్తోంది. ఇలా కరోనా సోకిన సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా కోలీవుడ్‌ సీనియర్‌ యాక్టర్‌ సత్యరాజ్‌ చేరారు.

సత్యరాజ్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలిన తర్వాత ఆయన ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి సత్యరాజ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన కుటుంబీకులు.. ఆయన్ను చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్సకు చేర్చినట్లు సమాచారం. అయితే సత్యరాజ్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు సత్య రాజ్ టాలీవుడ్‌లోనూ మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలిలో కట్టప్ప రోల్‌లో నటించిన సత్యరాజ్‌.. మరింత ఫేమ్‌ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. చాలామంది నటుడు సత్యరాజ్‌ చెబితే ఎవరా అని ఆలోచిస్తుంటారు.. అదే కట్టప్ప అని చెప్పగానే ఇట్టే గుర్తుకు తెచ్చుకుంటారు. అంతలా బాహుబలిలో సత్యరాజ్‌ పోషించిన కట్టప్ప పాత్ర సినీ అభిమానుల్లో నాటుకుపోయింది. మరి కట్టప్ప హెల్త్‌ రిపోర్టు గురించి ఆయన అభిమానులకు కుటుంబీకులు ఏం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: