టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ వాస్తవానికి ఈపాటికి రిలీజ్ కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా చాలా రాష్ట్రాల్లో 50 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ విధించడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేసారు. ఇక ఆచార్యలో సిద్ద అనే పాత్ర చేస్తున్న రామ్ చరణ్, తొలిసారిగా తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో తప్పకుండా మూవీ సక్సెస్ కొట్టేలా తన పాత్ర కోసం ఎంతో బాగా కష్టపడ్డారట చరణ్.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది. ఇక ఆర్ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఎంతో భారీ వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు కొన్నాళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో మరొక భారీ సినిమా మొదలెట్టారు చరణ్. అయితే ఈ సినిమాల తరువాత యూవి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు చరణ్. ఇటీవల ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల ప్రకారం గౌతమ్ తో చరణ్ చేయనున్న సినిమా ఆగిపోయిందని అంటున్నారు.

వాస్తవానికి ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు కొనసాగుతుండడంతో శంకర్ సినిమా షూటింగ్ వాయిదా పడిందని, అలానే అటు ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడడం, మరోవైపు ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆచార్య రిలీజ్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని, దానితో ఇవన్నీ సెట్ అయి శంకర్ సినిమా పూర్తిగా కంప్లీట్ చేసిన అనంతరమే గౌతమ్ సినిమా చేయాలని చరణ్ నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారమట. అయితే ఈ విషయం తెలియని కొందరు గౌతమ్ మూవీ పూర్తిగా ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులు చక్కబడితే త్వరలో చరణ్, గౌతమ్ మూవీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటకు వస్తాయని అంటున్నారు. మరి పక్కాగా చరణ్,గౌతమ్ ల మూవీ అసలు ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: