టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `హైదరాబాద్ నవాబ్స్` అనే చిత్రానికి సహాయ దర్శకునిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన నిఖిల్‌.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వ‌హించిన `హ్యాపీ డేస్‌` సినిమాతో న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా త‌ర్వాత అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్, యువత, కళావర్ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా ఇలా ప‌లు చిత్రాలు చేసి ప‌ర్వాలేద‌నిపించుకున్నా.. స‌రైన హిట్ మాత్రం అందుకోలేక‌పోయాడు.

అలాంటి స‌మ‌యంలో సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `స్వామిరారా` చిత్రంతో నిఖిల్ బిగ్ హిట్ కొట్టాడు. కలర్స్ స్వాతి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 2013లో విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత నిఖిల్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో త‌మ మార్కెట్‌ను చ‌క్క‌గా పెంచుకున్నాడు.

ఇకపోతే నిఖిల్ కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సీరియ‌ల్‌లో న‌టించాడు. కానీ, ఈ విష‌యం దాదాపు చాలా మందికి తెలియ‌దు. నిఖిల్ న‌టించిన సీరియ‌ల్ `చ‌ద‌రంగం`. ఈ సీరియ‌ల్ చాలా ఏళ్ల కింద‌ట ప్ర‌ముఖ టీవీ ఛానెల్ ఈటీవీలో ప్ర‌సారం అయింది. ఈ సీరియ‌ల్‌లో రాజీవ్ క‌న‌కాల‌, త‌నికెళ్ల‌ భ‌ర‌ణిల‌తో పాటు హీరో నిఖిల్ కూడా ఓ బుల్లి పాత్ర‌ను పోషించాడు. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి టాలీవుడ్‌లో హీరోగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

కాగా, ప్ర‌స్తుతం ఈయ‌న కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 చేస్తున్నాడు. అలాగే కుమారి 21ఎఫ్‌ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో `18 పేజెస్` అనే మ‌రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు చిత్రాల్లోనూ అనుపమ పరమేశ్వరన్‌నే హీరోయిన్‌గా నటిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: