పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కొండపల్లి దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `మిస్టర్ పర్ఫెక్ట్`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, నాజర్, మాగంటి మురళీ మోహన్, సాయాజీ షిండే కీలక పాత్రలను పోషించిన ఈ చిత్రం 21 ఏప్రిల్ 2011న విడుదలై మంచి విజయం సాధించింది.
తనకు నచ్చిందే చేస్తే తనే పర్ఫెక్ట్. కాస్త కాంప్రమైజ్ అయి నలుగురికి నచ్చేట్లు చేయగలిగితే అతనే మిస్టర్ పర్ఫెక్ట్.. అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే నిజానికి ఈ సినిమా టైటిల్ను మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించారట.
అసలేం జరిగిందంటే.. కిక్ సినిమాతో హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి ఆపై మహేష్ కోసం మాఫియా నేపథ్యంలో ఓ కథను రెడీ చేసి వినిపించగా అది ఆయనకు బాగా నచ్చేసిందట. వీరి కాంబో చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకు వచ్చి.. మహేష్కు రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట. అలాగే ఈ సినిమాకు `మిస్టర్ పర్ఫెక్ట్` అనే టైటిల్ను ఖరారు చేయించారట. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక కొద్ది రోజుల తర్వాత ప్రభాస్ సినిమా కోసం దర్శకుడు దశరథ్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కు ఫోన్ చేసి `మిస్టర్ పరఫెక్ట్` టైటిల్ను కోరగా.. ఆయన డార్లింగ్ కోసం దానిని ఇచ్చేశారు. అలా మహేష్ బాబు టైటిల్తో ప్రభాస్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు.