స్టార్ హీరోల క్రేజ్ మామూలుగా ఉండదు. వాళ్లను అనుభవజ్ఞులైన దర్శకులు ఎక్కువ శాతం దర్శకత్వం వహిస్తుంటారు. ఇక కుర్ర దర్శకులైతే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఎందుకంటే యువ దర్శకులకు పెద్దగా అనుభవం ఉండదు. అయితే ఇప్పటి యంగ్‌ డైరెక్టర్స్ ఈ అభిప్రాయాలను మార్చేస్తున్నారు. భారీ సినిమాలు తీస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు.

వెంకీ కుడుముల 'ఛలో' అనే సినిమాతో మెగాఫోన్ పట్టాడు. తొలి చిత్రంతోనే కుర్రకారును మెప్పించాడు.  ఆ తర్వాత నితిన్‌తో 'భీష్మ' అనే చిత్రం తీశాడు. అయితే ఈ సెకండ్‌ సినిమా తర్వాత కొంచెం సమయం  తీసుకున్న వెంకీ కుడుముల మూడో సినిమాకి మెగాస్టార్‌ని దర్శకత్వం చేసే అవకాశాన్ని అందుకున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక నాగ్‌ అశ్విన్‌ రెండో సినిమా 'మహానటి'తోనే సినిమా ఇండస్ట్రీని మెప్పించాడు. సావిత్రి బయోపిక్‌ని చాలా ఎమోషనల్‌గా తీశాడని స్టార్ హీరోస్ కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో  జాతీయ స్థాయిలో సత్తాచాటిన నాగీ, ఇప్పుడు ప్రభాస్‌తో వరల్డ్‌క్లాస్ మూవీ తీస్తున్నాడు. 'ప్రాజెక్ట్ కె' పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.  'జాతిరత్నాలు' సినిమాతో ఫుల్ పాపులర్‌ అయ్యాడు అనుదీప్. సినిమా ఎంత హిట్‌ అయ్యిందో, అనుదీప్‌ కామెడీ టైమింగ్‌కి అంత పేరు వచ్చింది. డైరెక్షన్‌ నుంచి యాక్టింగ్‌లోకి వెళ్తాడా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఈ దర్శకుడు మాత్రం 'జాతిరత్నాలు' తర్వాత కొంత సమయం తీసుకుని శివకార్తికేయన్‌తో తెలుగు, తమిళ్‌ బైలింగ్వల్‌ తీస్తున్నాడు. అనుదీప్ ఈ మూవీ తర్వాత వెంకటేశ్‌తో ఒక సినిమా తీస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సందీప్‌ వంగా ఫస్ట్ మూవీ 'అర్జున్‌ రెడ్డి'తో ఇండస్ట్రీలో చిన్నపాటి సంచలనం సృష్టించాడు. ఈ బోల్డ్ లవ్‌స్టోరీకి బాలీవుడ్‌ జనాలు కూడా ఇంప్రెస్ అయ్యారు. హిందీలో 'అర్జున్‌ రెడ్డి'ని 'కభీర్‌ సింగ్‌'గా రీమేక్‌ చేస్తే అక్కడా బ్లాక్‌ బస్టర్‌ వచ్చింది. ఈ హిట్‌తో రణ్‌బీర్‌ కపూర్‌ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ చాక్లెట్‌బాయ్‌తో 'ఆనిమల్' అనే సినిమా తీస్తున్నాడు. అలాగే ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే సినిమా అనౌన్స్ చేశాడు. 'జెర్సీ' సినిమాతో నేషనల్‌ అవార్డ్ అందుకున్నాడు గౌతమ్‌ తిన్ననూరి. సెకండ్‌ మూవీతోనే నేషనల్‌ అవార్డ్స్ అందుకున్న ఈ స్టార్ మూడో సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లాడు. షాహిద్‌ కపూర్‌తో 'జెర్సీ' రీమేక్ చేశాడు. పోయినేడాది డిసెంబర్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థర్డ్‌ వేవ్‌తో వాయిదా పడింది. ఇక ఇప్పుడు రామ్‌ చరణ్‌తో పాన్ ఇండియన్‌ మూవీ చెయ్యబోతున్నాడు గౌతమ్.

హీరోలకి కావాల్సింది సూపర్‌ హిట్. నిర్మాతలకు కావాల్సింది లాభాలు తెచ్చి పెట్టే దర్శకులు. సో ఈ లెక్కలని మ్యాచ్ చేస్తే చాలు.. డైరెక్టర్ ఏజ్, ఎక్స్‌పీరియన్స్‌ని ఎవరూ పట్టించుకోరు. సూపర్ హిట్ తీస్తాడనే నమ్మకం తెచ్చుకుంటే బడా హీరోలు పిలిచీ మరీ అవకాశాలు ఇస్తారు. బిజీగా ఉన్నామంటే వెయిట్‌ చెయ్యడానికి కూడా రెడీ అంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: