సహజంగా సినిమా ఫంక్షన్లలో చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు మహేష్ బాబు. ఇటీవల కాలంలో కనీసం ఆమాత్రం అయినా మాట్లాడుతున్నారు కానీ, గతంలో ఆయన మాట్లాడిందే తక్కువ. అయితే డ్యాన్స్ లు, స్టేజ్ పై మూమెంట్స్ అస్సలు ఆయన నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం. అలాంటి మహేష్ బాబు.. మ.. మ.. మహేషా పాటకోసం స్టేజ్ ఎక్కారు. అదిరిపోయే స్టెప్పు వేశారు. స్టేజ్ పై కనిపించింది కాసేపే అయినా మహేష్ బాబు మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు.

 

కర్నూలులో జరిగిన సర్కారు వారి పాట సక్సెస్ టూర్ లో మహేష్ బాబు స్టేజ్ ఎక్కి స్టెప్పు వేశారు. తమ అభిమాన హీరో ఇలా స్టెప్పులేస్తారని తెలియనివారంతా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తమన్ కి కూడా బహుశా ఈ ట్విస్ట్ తెలిసి ఉండదేమో. ఆయన కూడా స్టేజ్ పైనుంచి మహేష్ తో కాలు కదిపారు. మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా విడుదల సమయంలో కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం ఫుల్లుగా ఉన్నాయని అంటున్నారు. ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా సినిమా నిలకడగా ఆడుతోంది. గతంలో ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఈవెంట్లే కానీ, ఇలా సక్సెస్ మీట్లకు మహేష్ కాస్త దూరంగానే ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం కాస్త సీరియస్ గా ప్రమోషన్ పై దృష్టిపెట్టారు.

సినిమా ప్రారంభోత్సవం రోజున తాను షూటింగ్ స్పాట్ కి రారు. అది మహేష్ బాబు సెంటిమెంట్. సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన మరుసటి రోజే ఆయన విదేశాలకు టూర్ వెళ్తారు. అది ఫ్యామిలీ టూర్. అది కూడా ఆయన సెంటిమెంట్. అలాంటి మహేష్ ఇప్పుడు విదేశీ టూర్ విషయంలో కాస్త ఆగినట్టున్నారు. ప్రస్తుతం సక్సెస్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ సినిమాకి కాస్త డివైడ్ టాక్ రావడం, సోషల్ మీడియాలో కొంతమంది నెగెటివ్ ప్రచారం చేయడంతో.. సినిమా యూనిట్ కి ఇలా పాజిటివ్ ప్రచారం తప్పనిసరిగా మారింది. దీంతో మహేష్ బాబు నేరుగా రంగంలోకి దిగారు. స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ అభిమానులకు ఇలా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: