డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తన స్టైల్ మార్చేశాడా.. ఇదివరకు 90 రోజుల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసే పూరీ ఇప్పుడు తను కూడా మిగతా దర్శకుల్లా టైం తీసుకుంటున్నాడా అంటే అవునంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదేంటి పూరీ తన స్టైల్ మార్చడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. పూరీ జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి చేసిన లైగర్ సినిమా ఇప్పటికే పూర్తయింది. కానీ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు.

మంచి రోజు కోసం ఎదురుచూస్తూ చాలా డేట్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఓ సినిమా హిట్ పడాలంటే కేవలం సినిమాలో ఎంత కంటెంట్ ఉంది అన్నది మాత్రమే సరిపోదు ఆ సినిమాకు సరైన రిలీజ్ డేట్ కూడా దొరకాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయ్ లైగర్ కి అదే పరిస్థితి ఎదురైంది. అందుకే 3 నెలల్లో సినిమా పూర్తి చేసి నాలుగో నెలలో సినిమా రిలీజ్ చేసే పూరీ తన పంథా మార్చేసి తన సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

లైగర్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఆయన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లైగర్ సినిమా రిలీజ్ అవకపోవడానికి అది కూడా ఒక కారణమని చెప్పుకుంటున్నారు. బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న లైగర్ సినిమా పూరీ మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచగా సినిమాతో విజయ్ మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని చూస్తున్నాడు. లైగర్ రిలీజ్ అవకుండానే పూరీ జగన్నాథ్ తో జన గణ మన సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: