ఆగస్టు 1నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ నడుస్తోంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. సినిమాల నిర్మాణం, హీరోల రెమ్యునరేషన్ ఇలా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న తరువాతే షూటింగ్స్ మొదలుపెట్టడానికి అనుమతివ్వాలని భావించారట..


అయితే గిల్డ్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న దిల్ రాజు లాంటి నిర్మాతలు తమ సినిమాల షూటింగ్స్ నిర్వహిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా 'వారసుడు' అనే సినిమాను నిర్మిస్తున్నారట దిల్ రాజు.


తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్స్ బంద్ అనుకున్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ మాత్రం నడుస్తోంది. ఈ విషయంపై స్పందించిన దిల్ రాజు. 'వారసుడు' సినిమా తమిళ చిత్రమని.. తెలుగులో డబ్ చేస్తున్నామని.. కాబట్టి అది తమిళ సినిమా కిందే లెక్క వస్తుందని చెప్పి తప్పించుకున్నారట. ఈ విషయంలో దిల్ రాజుపై మండిపడుతున్నారట నిర్మాతలు. దిల్ రాజు చెప్పిన లాజిక్ నే కారణంగా చెబుతూ.. మరికొన్ని మల్టిలింగ్యువల్ సినిమాలు కూడా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.


 


దీంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ త్వరగా ఈ బంద్ కి సంబంధించి ఏదొక నిర్ణయం తీసుకోవాలని మీటింగ్స్ నిర్వహిస్తోంది. ఇంతలో యంగ్ హీరో నాని తన 'దసరా' సినిమా షూటింగ్ తిరిగి మొదలుపెట్టాలని చూస్తున్నారట. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ ఆలస్యం చేస్తే వడ్డీల భారం పెరిగిపోతుందని భావించిన నిర్మాత.. సినిమాను తిరిగి మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట..


 


దీనికి నాని కూడా ఓకే చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ 'దసరా' మేకర్స్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వారు బంద్ చేయడానికి ఒప్పుకోవడం లేదట. ఒక్కసారి నాని సినిమా షూటింగ్ గనుక మొదలైతే మిగిలిన సినిమాలు కూడా షూటింగ్స్ నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: