రజనీ సినిమా విషయంలో ఇప్పుడు అదే జరిగింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి `జైలర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. రజనీ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దిలీప్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ వంటి నటులు జైలర్ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్గా మొదట ఐశ్వర్యా రాయ్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు తమన్నా ఫైనల్ అయ్యిందని అంటున్నారు. అంతకంటే ముందే మరో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ని ఖరారు చేశారట.
కానీ ఆమె తప్పుకుందని తెలుస్తుంది. దర్శకుడు నెల్సన్తో విభేదాల కారణంగా ప్రియాంక మోహన్ సినిమాకి గుడ్ బై చెప్పిందని అంటున్నారు. నెల్సన్ అంతకు ముందు శివ కార్తికేయన్తో `డాక్టర్` సినిమా చేశారు. అందులో ప్రియాంక మోహన్ కథానాయిక. ఆ సినిమా టైమ్లోనే వీరిద్దరికి పడలేదట. అవన్నీ సర్దుమనుగుతాయని అంతా భావించారు. పైగా రజనీకాంత్ సినిమా అంటే వదులుకునే ఛాన్స్ లేదు. దీంతో ఓకే చెప్పిందట ప్రియాంక. కానీ దర్శకుడితో ఆ గ్యాప్ అలానే ఉండటంతో ఆమె చివరి నిమిషంలో తప్పుకుందని సమాచారం.
దీంతో ప్రియాంక మోహన్ స్థానంలో తమన్నా ఎంపికైందని అంటున్నారు. మొత్తంగా ప్రియాంక తప్పుకోవడంతో మిల్కీ బ్యూటీకి లక్కీ ఛాన్స్ దక్కిందని అంటున్నారు నెటిజన్లు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో తమన్నా పాల్గొనే అవకాశం ఉందట. అయితే తమన్నా హీరోయిన్ అని చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం గమనార్హం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.
ఇక తమన్నా వరుసగా సీనియర్లతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఆమె తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్` చిత్రం చేస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వాయిదా పడిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చి దిలీప్ కుమార్తో ఓ సినిమా చేస్తుంది. హిందీలో మధుర్ భండార్కర్ డైరెక్షన్లో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం `బబ్లీ బౌన్సర్` ఈ నెల 23న విడుదల కానుంది.దీంతోపాటు మరో రెండు సినిమాలు చేస్తుంది తమన్నా.
ప్రియాంక అరుల్ మోహన్ తెలుగులో `గ్యాంగ్లీడర్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత శర్వానంద్ `శ్రీకారం` చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో తెలుగు సినిమా కి గ్యాప్ ఇచ్చింది. తమిళంపై ఫోకస్ పెట్టింది. అక్కడ సూర్యతో `ఈటీ`, శివకార్తికేయన్తో `డాన్`, డాక్టర్ చిత్రాలు చేసింది. జయం రవితో ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తుంది ప్రియాంక మోహన్.