ఈమధ్య కాలంలో జనం సినిమాలకు రావడంలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు తెగ టెన్షన్ పడుతున్న పరిస్థితులలో విడుదలైన మూడు మీడియం రేంజ్ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగ వ్రాయడమే కాకుండా తీసే సినిమాలో కొత్తదనం కనిపిస్తే ప్రేక్షకులు క్యూ కడతారు అన్నవిషయాన్ని ఈమధ్యనే విడుదలై అఖండ విజయం సాధించిన ‘బింబిసార’ ‘సీతారామం’ ‘కార్తికేయ 2’ సినిమాలు రుజువు చేసాయి. అయితే ఈసినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి చందు మొండేటి మల్లిడి వశిష్ట లు తమకు బ్లాక్ బష్టర్ హిట్స్ వచ్చినప్పటికీ తమతో సినిమాలు చేసే క్రేజీ హీరోలు దొరకక తెగ ఇబ్బంది పడుతున్నట్లు టాక్.


ఈముగ్గురు దర్శకులను ఆకాశానికి ఎత్తేస్తూ మన టాప్ హీరోలు ప్రశంసలు కురిపించారు కానీ వారితో సినిమాలు చేయడానికి కనీసం వారు చెప్పే కథలు వినడానికి ఆశక్తి కనపరచడంలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికికారణం టాప్ యంగ్ హీరోలు అదేవిధంగా మీడియం రేంజ్ హీరోలు వీరంతా తాము ఏ దర్శకుడుని నమ్మాలి ఏకథను ఎంచుకుంటే తమకు సూపర్ హిట్ వస్తుంది అన్న కన్ఫ్యూజన్ ప్రధాన కారణం అంటున్నారు.


దర్శకులను నమ్మి వెరైటీ సినిమాలను చేసే నాని లాంటి హీరోలు కూడ తన భవిష్యత్ సినిమాల ఎంపిక పై పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి రామ్ నితిన్ లకు కూడ కొనసాగుతూ ఉండటంతో ఈ బ్లాక్ బష్టర్ దర్శకులు చెప్పే కథలను పూర్తిగా నమ్మలేకపోతున్నారు అన్న అభిప్రాయలు కూడ వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు మీడియం రేంజ్ హీరోల దృష్టి కూడ క్రేజీ దర్శకుల పై ఉంది.

అయితే వారంతా టాప్ యంగ్ హీరోల ప్రాపకం గురించి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులలో మీడియం రేంజ్ హీరోల వైపు టాప్ దర్శకులు చూడటం లేదు అని అంటారు. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బష్టర్ తీసిన బుచ్చి బాబు సంవత్సరాలు తరబడి జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు కాని అతడితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్న హీరోలను పట్టించుకోని విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: