ప్రముఖ టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవర కొండపై బెంగాలీ నటి, సింగర్‌ మలోబిక బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో విజయ్‌ హిందీని అవమానించేలా మాట్లాడారని, కానీ, ఇప్పుడు హిందీలోనే సినిమా చేశారని ఆమె అన్నారు. విజయ్‌ హిందీని హిబ్రూ అన్నారని ఆమె తెలిపారు. తాజాగా, ఆమె ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ కొన్నేళ్ల క్రితం నేను విజయ్‌ కలిసి ‘నీ వెనకాలే నడిచి’ అనే మ్యూజిక్‌ వీడియోలో నటించాం. అ‍ప్పటికే అర్జున్‌ రెడ్డి హిట్‌తో అతడు చాలా పాపులర్‌ అయ్యాడు. షూటింగ్‌ సమయంలో నేను ఎక్కువగా హిందీలో మాట్లాడేదాన్ని. కానీ, అతడికి హిందీ మాట్లాడటం రాదు.అయినా నేను హిందీలోనే మాట్లాడేదాన్ని. నేను హిందీలో మాట్లాడటం చూసి నవ్వుకునేవాడు. తనకు హిందీ అర్థంకాదని అంటూ హిందీని అవమానిస్తూ మాట్లాడేవాడు. అంతేకాదు! హిందీని హిబ్రూ భాషలాగా ఉందని అనేవాడు. నా ముందు ఎప్పుడూ తెలుగులో మాట్లాడేవాడు. చాలా ఏళ్ల తర్వాత లైగర్‌ టీజర్‌ చూశా. నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే.. అప్పుడు అవమానకరంగా మాట్లాడిన హిందీలోనే ఇప్పుడు అతడు సినిమా చేశాడు. నాకు నవ్వుకూడా వచ్చింది. లైగర్‌ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నపుడు అతడు హిందీని ఎలా అవమానించాడో ప్రజలకు చెప్పాలనుకున్నా.

కానీ, అతడు నాకు మంచి స్నేహితుడు అవ్వటం వల్ల అలా చేయలేదు. విజయ్‌కి ‘బాలీవుడ్‌కు స్వాగతం’ అని మెసెజ్‌ చేశా. లైగర్‌ పోస్టర్‌ షేర్‌ చేశా. సినిమాలో అతడికి ఎక్కువగా హిందీ డైలాగ్‌లు లేవని నాకు అర్థం అయింది. ఏది ఏమైనప్పటికి విజయ్‌ చాలా మంచి మనిషి. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు’’ అని చెప్పుకొచ్చింది. కాగా, విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్‌’ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్యాన్‌ ఇండియా సినిమాగా విడుదలైంది. అయితే, అంచనాలను లైగర్‌ అందుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: