తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తీసింది తక్కువ చిత్రాలే అయినా..అద్భుతమైన విజయం సాధించాయి. బాహుబలి తర్వాత తెలుగు చిత్రసీమలో విభిన్నమైన చిత్రాల నిర్మాణం ఊపందుకొన్నది. ఆ క్రమంలోనే రంగస్థలం విలక్షణమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధృవ చిత్రం తర్వాత రాంచరణ్, నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో విశేషాలను సొంతం చేసుకొన్నది.
ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రోమో ఇలా ప్రతి ఒక్క విషయంలో దర్శకులు సుకుమార్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అందరి అంచనాలకు మించి ఈ సినిమా విజయం సాధించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇక రంగస్థలం లో రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
సెలబ్రెటీలు చెర్రీ నటనకు ఖితాబు ఇస్తున్నారు..ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ చేరారు. తాను ఇప్పుడే రంగస్థలం చూశానని చెప్పిన తారక్, రామ్ చరణ్పై పొగడ్తలు గుప్పించారు. సినిమాలో చరణ్ చేసిన నటనకు అభినందనలు, ప్రశంసలు అందుకునే అర్హత ఉందని వ్యాఖ్యానించారు. తన తరపునుంచి కూడా అభినందనలు తెలిపారు.
చిట్టిబాబు పాత్రను చరణ్ కంటే ఎవరూ బాగా చేయలేరంటూ ఆకాశానికెత్తేశారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు సినీ నటులు కూడా మెచ్చుకుంటున్నారు. కొందరైతే బహుమతులిచ్చి మరీ ప్రశంసిస్తుండటం గమనార్హం.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చరణ్ని కలిసి ఓ గిఫ్ట్ ఇచ్చింది.
గిఫ్ట్ అయితే గోప్యంగా ఉంది కానీ..ఈ ఫోటో మాత్రం వైరల్ అయ్యింది. రంగస్థలం తొలి రోజు కలెక్షన్లు అనూహ్య రీతిలో దాదాపు 40 కోట్ల రూపాయలను దాటేశాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.