సరైన హిట్ లేకపోయినా సాయికుమార్ ఆది మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయినా బాక్సాఫీస్ వద్ద.. ఇంకా హిట్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'బుర్రకథ' అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. అయితే ఈ 'బుర్ర..' కథలో హీరో రెండు మెదళ్లతో పుడతాడట. మరి అలాంటి హీరో పెరిగి పెద్దయ్యాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? ఆ పరిస్థితుల కారణంగా అతని జీవితంలో చోటు చేసుకున్న మలుపులు ఏమిటి ? చివరికీ మన హీరో 'బుర్ర'కి ఎలాంటి ముగింపు వస్తోంది ? లాంటి ఇంట్రస్టింగ్ పాయింట్ లతో ఆది ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు.
కాగా తాజాగా విడుదల తేదీని కూడా ఫైనల్ చేసింది 'బుర్రకథ' చిత్రబృందం. జూన్ 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మరోపక్క జూన్ లో ఇప్పటికే ఏడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటితో 'బుర్రకథ' కూడా పోటీ పడనుంది. మరి ఈ పోటీలో 'బుర్రకథ' నెగ్గుతుందో లేదో చూడాలి.
ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను వింటేజ్ క్రియేషన్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై హెచ్ కె.శ్రీకాంత్ దీపాల ఈ సినిమా నిర్మిస్తున్నారు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో ఆదికి జోడిగా మిస్తీ చక్రబోర్తి - నైరా షా కథానాయకులుగా నటిస్తున్నారు.