మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టు నెలలో ట్రైలర్, ఆడియో వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 2 వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. చారిత్రాత్మక సినిమా కావడంతో దాదాపు ఈ సినిమా కోసం రెండేళ్లు మెగాస్టార్ పనిచేశారు. రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఖర్చుతో తెరక్కించారు. మొదటి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా తరువాత మెగాస్టార్.. కొరటాల సినిమా ప్రారంభం కాబోతున్నది. కొరటాల ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇక మిగిలింది లాంఛనంగా ప్రారంభం కావడమే. భరత్ అనే నేను తరువాత మెగాస్టార్ సినిమాకు కమిట్ అయ్యి గత సంవత్సరం కాలంగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. మెగాస్టార్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి మిగతా హీరోల జోలికి వెళ్ళలేదు.
మెగాస్టార్ కొరటాల కాంబినేషన్లోని సినిమా మెగాస్టార్ పుట్టిన రోజైన ఆగష్టు 22 వ తేదీన ప్రారంభం కాబోతున్నది. నవంబర్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. వచ్చే ఏడాది ఉగాదిని లక్ష్యంగా చేసుకొని సినిమాను షూట్ చేస్తారట. ఈ సినిమాను రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ నిర్మిస్తున్నారు. ఇందులో ఒక పాత్ర కోసం అనసూయను తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటె, ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అనే దాని చుట్టూనే అనేక కథనాలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా మొదట నయనతారను అనుకున్నారు. ఆ తరువాత నయనతార ఎలాగో సైరాలో చేసింది కాబట్టి ఆమెను పక్కన పెట్టి మరో హీరోయిన్ కోసం ట్రై చేశారు. తమన్నా లైన్లోకి వచ్చింది. ఐశ్వర్యరాయ్ ను కూడా తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోపేరు వినిపిస్తోంది. ఆమె కాజల్. మెగాస్టార్ తో కలిసి కాజల్ ఖైదీ నెం 150 సినిమా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్టైంది. మరి ఈమెనైనా ఫైనల్ చేస్తారో లేదంటే మరో హీరోయిన్ కోసం చూస్తారో చూడాలి.