తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్, అనుష్కే. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీటికి మరింత బలం చేకూరుస్తూ ఈ ఇద్దరూ త్వరలోనే లండన్ వెళ్లనున్నారు. ప్రభాస్, అనుష్క జంటగా లండన్ వెళ్తుండటంతో అసలేం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇద్దరూ వెళ్తున్న టూర్ పర్సనల్ మాత్రం కాదు.. పక్కా ప్రొఫెషనల్ ట్రిప్. అక్కడ వాళ్ల సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి వెళ్తున్నారు.
ఇప్పుడు ప్రభాస్ నటించిన సినిమా ఏముంది అనే అనుమానం రావచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పుడు నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. దాంతో ఈయన గత సినిమాలను మన దేశంలోనే కాదు.. పక్క దేశాల్లో కూడా అనువాదం చేసి విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ప్రభాస్ నటించిన గత సినిమాలు ఇప్పుడు లండన్లో విడుదల చేయాలని చూస్తున్నారు. దాంతో పాటు బాహుబలి 2కి కూడా ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాను అక్టోబర్లో అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రదర్శించనున్నారు.
లండన్లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'బాహుబలి 2' సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ వేడుక ప్రతీ ఏడాది జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కొన్ని సినిమాలను ఎంపిక చేసుకుని అక్కడ ప్రదర్శిస్తారు. ఇప్పుడు బాహుబలి 2కు ఈ అవకాశం వచ్చింది. ఓ తెలుగు సినిమాకు ఇలాంటి అరుదైన అవకాశం రావడం నిజంగానే గర్వకారణం. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా లండన్ వెళ్లి అక్కడి ప్రేక్షకులతో తమ అనుభవాలు పంచుకుంటారని తెలుస్తుంది. అందుకే ప్రభాస్, అనుష్క, రానాతో పాటు రాజమౌళి కూడా లండన్ వెళ్లనున్నాడని తెలుస్తుంది.
బాహుబలి 2 ఇప్పటికే అన్ని దేశాల్లోనూ విడుదలైంది. అన్నిచోట్ల నుంచి మంచి స్పందనే అందుకుంది. ఈ సినిమా కోసం చాలా దేశాలు తిరిగాడు రాజమౌళి. ఇప్పుడు లండన్ కూడా వెళ్లనున్నాడు. అందుకే తమ సినిమాల నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని అక్టోబర్లో అక్కడికి వెళ్లనున్నారు చిత్రయూనిట్. దీనిపై ప్రభాస్, అనుష్క కూడా ప్రత్యేకంగా మీడియాకు వివరణ ఇస్తారని తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్, అనుష్క కలిసి లండన్ ప్రయాణం వెళ్లడం మాత్రం ఖాయమైపోయింది.