రామాయణం కావ్యం ఆధారంగా గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎందరో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. దాదాపుగా రామాయణం కథ ఆధారంగా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే, ఈ మోడ్రన్ రోజుల్లో రామాయణం ఆధారంగా సినిమాలు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బడ్జెట్. రెండోది నిర్మాణ సమయం.
ఇప్పటి రోజుల్లో అలాంటి కావ్యాన్ని తెరపై సృష్టించాలి అంటే భారీ బడ్జెట్ అవసరం. సాంకేతికంగా ఉన్నతంగా సినిమాను తెరకెక్కించాలి. అప్పుడే చూసేందుకు బాగుంటుంది. ఇలా తీయాలి అంటే నిర్మాణ వ్యయం అధికం అవుతుంది. వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా సినిమా తీయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందులో సందేహం లేదు.
అల్లు అరవింద్, ప్రైమ్ మూవీస్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మూడు భాగాలుగా సినిమాను 3డి లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, రామాయణం అనగానే మొదట గుర్తుకు వచ్చేది రాముడు, రావణుడు. ఈ రెండు పాత్రలు ఇందులో కీలకం. వీటిని చేయాలి అంటే మామూలు విషయం కాదు. అందుకే సరైన నటీనటులు దొరక్క ఇలాంటి వాటి జోలికి వెళ్ళరు.
ఇప్పుడు అరవింద్ రామాయణంలో మొదట రాముడిగా చరణ్ ను అనుకున్నారు. కానీ, చరణ్ ఆ పాత్రపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే, అరవింద్ మదిలో ప్రభాస్ ఉన్నాడట. రాముడంటే ఆజానుబాహుడు.. అంటారు. అందుకే ప్రభాస్ అయితే రాముడి క్యారెక్టర్ కు సెట్ అవుతారని భావించిన అరవింద్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది.
మరోవైపు రావణుడిగా ఎన్టీఆర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. రావణుడు పాత్రలో ఎన్టీఆర్ తప్పితే మరొకరిని ఊహించుకోవడం కష్టం. రావణుడిగా హావభావాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. సినిమాకు భారీ క్రేజ్ రావాలి అంటే... రావణుడిగా ఎన్టీఆర్ చేయాలి. పైగా జై లవకుశ సినిమాలో రావణ పాత్రలో ఎన్టీఆర్ నటన ఎలా ఉన్నదో చూశాం. సో, ఇప్పుడు అరవింద్ ప్రభాస్, ఎన్టీఆర్ ల డేట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. వారి డేట్స్ దొరికితే సినిమా సెట్స్ మీదకు వెళ్ళినట్టే. 2021 లో మొదటి భాగం రిలీజ్ అని ప్రకటించారు. మరి అనుకున్నట్టుగా సినిమా 2021 లో రిలీజ్ అవుతుందా ? చూద్దాం.