"నేను శైలజ" సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన
కీర్తి సురేష్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి అవకాశాలే దక్కాయి. పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి చిత్రంలో కూడా నటించింది. అయితే వీటన్నింటిలో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ
సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన "మహానటి" సినిమా ఆమెను శిఖరాగ్రాన కూర్చోబెట్టింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది.
సావిత్రి పాత్రలో
కీర్తి సురేష్ జీవించిందనే చెప్పాలి. తెర మీద చూస్తున్నంత సేపు
సావిత్రి గారిని చూసిన ఫీలింగ్ కలిగింది. అందుకే ఆ పాత్ర ఆమెకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాకి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. అయితే
కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
తెలుగుతో పాటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే ఈ టాలెంటెడ్ హీరోయిన్
కీర్తి సురేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పెంగ్విన్ చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ప్రముఖ తమిళ దర్శకుడు
కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దర్శకుడిగా ఈశ్వర్
కార్తీక్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
ఈ సినిమాకి "పెంగ్విన్" అనే ఒక పక్షి పేరును టైటిల్ గా పెట్టిన చిత్ర యూనిట్ డార్క్ షేడ్ లో గర్భవతిగా ఉన్న
కీర్తి సురేష్ ఫోటోతో కూడిన పోస్టర్ విడుదల చేశారు. దీనితో
కీర్తి ఈ చిత్రంలో ప్రెగ్నెంట్ విమెన్ గా ఛాలెంజింగ్ రోల్ చేస్తుందని అర్థం అవుతుంది. ఈ మూవీతో పాటు,
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఒక మూవీ, నరేంద్రనాధ్ దర్శకుడిగా ‘మిస్ ఇండియా’ అనే మరో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో
కీర్తి సురేష్ నటిస్తున్నారు.