ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠుపురములో సినిమాలు రెండూ కూడా సంక్రాంతి బరిలో ఒకే రోజున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే అతి త్వరలో అదే విధంగా రెండు భారీ తమిళ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న బిగిల్ కాగా మరొకటి యాక్షన్ స్టార్ కార్తీ నటిస్తున్న ఖైదీ సినిమా. ఇప్పటికే తమిళ నాట రిలీజ్ అయిన బిగిల్ సినిమా ట్రైలర్ దేశవ్యాప్తంగా అత్యధిక యూట్యూబ్ లైక్స్ పొందిన వీడియో గా అతి పెద్ద రికార్డు ని సృష్టించడంతో పాటు సినిమాపై తారాస్థాయిలో అంచనాలు పెంచడం జరిగింది. 

యువ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా, విజయ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే యాక్షన్ స్టార్ కార్తీ హీరోగా డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరక్కుతున్న తాజా సినిమా ఖైదీ. కార్తీ ఒక లారీ డ్రైవర్ గా మంచి మాస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై కూడా కోలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించినబడిన ఈ సినిమా, కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. 

కార్తీకి ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం, అలానే ఈ సినిమాలో ఒక్క పాట కూడా లేకపోవడం ఒక గమ్మత్తైన అంశం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాను కూడా ఈనెల 25నే రీరిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ రెండు భారీ అంచనాలున్న సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండడంతో, ఏ సినిమా ఎంతమేర సక్సెస్ అవుతుందో అని అందరిలోనూ ఒకటే ఆసక్తి ఉంది. మరి ఏది ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో, ఎవరు ఈ బరిలో విజేతగా నిలుస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: