సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అంటుంటే.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' అంటూ ఇద్దరూ ఒకేరోజున జనవరి 12న పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈ పోటీ కారణంగా సంక్రాంతికి రావల్సిన ఓపెనింగ్స్ దెబ్బతింటాయని బయ్యర్లు కంగారుపడిపోతున్నారు. ఇక ఆయా హీరోల అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పటి నుండే పోటీ వాతావరణం కనబడుతోంది. రెండు టీమ్స్ ఇప్పుడిప్పిడే ప్రచారాన్ని స్టార్ట్ చేశాయి. అయితే 'సరిలేర నీకెవ్వరు' కంటే 'అల వైకుంఠపురములో' టీమ్ ప్రచారంలో ముందంజలో ఉంది. మహేష్ అండ్ టీమ్ పోస్టర్లతోనే సరిపెడుతుంటే బన్నీ బృందం మాత్రం పోస్టర్లతో పాటు పాటలని కూడా వదులుతున్నారు. ఇప్పటివరకు విడుదలచేసిన రెండు పాటలు అనూహ్య రీతిలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పాటల విజయంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ 'సరిలేరు నీకెవ్వరు' నుండి రాబోయే అప్డేట్ ఏదైనా సరే ఆషామాషీగా కాకుండా 'అల వైకుంఠపురములో'ను మించి ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు.
ఇది ఒకరకంగా మహేష్ టీమ్ మీద ఒత్తిడి పెరగడం లాంటిదే. డిసెంబర్ నుండి ప్రచారం మొడలుపెట్టాలని నిర్ణయించుకున్న టీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వాలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ఉంటుంది. పెరుగుతున్న అభిమానుల అంచనాల దృష్ట్యా వాటిని త్రివిక్రమ్, బన్నీల సినిమా అప్డేట్స్ తో పోల్చి చూసుకోవాల్సిన పరిస్థితి. పోలిక వచ్చిందంటే ఒక్కోసారి మార్పులు తప్పవు. ఇది తప్పకుండా టీమ్ మీద ప్రెజర్ పెంచే విషయమే. మరి దీన్ని అనిల్ రావిపూడి, మహేష్ ఏ మేరకు హ్యాండిల్ చేస్తారో చూసాలి. అయితే ఇండస్ట్రీ టాక్ మేరకు మహేష్ 12వ తేదీన రావాలని పట్టుబట్టడానికి కారణం, లెక్క తప్పితే తీవ్ర నష్టమని తెలిసినా వెనుకాడకపోవడానికి రీజన్ దర్శకుడు అనిల్ రావిపూడేనట. అనిల్ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చూసి ఎట్టి పరిస్థితుల్లో సినిమా బాగుంటుందని మహేష్ ఫిక్స్ అయిపోయారట. పైగా సినిమా ఎంటెర్టైనింగ్ జానర్. అనిల్ రావిపూడి గత సంక్రాంతి సీజన్లో 'ఎఫ్ 2' సినిమాతో వచ్చి పెద్ద సినిమాలనే అధిగమించి తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు. ఆ చిత్రంతో ప్రేక్షకుల్లో ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. ఈ కారణాలే మహేష్ అతని మీద ఇంత నమ్మకం ఎర్పరుచుకునేలా చేసి ఉండవచ్చు. మరి సూపర్ స్టార్ నమ్మకాన్ని రావిపూడి ఎంతమేరకు నిలబెట్టుకుంటారో చూడాలి.