తెలుగు బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-3 చివరి దశకు చేరుకోబోతోంది. అయితే గ్రాండ్‌ ఫినాలేను ఎంతో గ్రాండ్‌గా జరపాలని భావిస్తున్న 'మా' టీవీ యాజమాన్యం ఈ ఫైనల్ ఎపిసోడ్ ను భారీగా ప్లాన్‌ చేస్తున్నారని లేటెస్ట్ న్యూస్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారట. ఇటీవలే ఈ ఫినాలేకు రావాలని షో నిర్వాహకులు చిరును కోరగా ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ మన్మథుడు, బిగ్‌బాస్ వ్యాఖ్యాత యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రంగంలోకి దిగడంతో మెగాస్టార్ కాదనలేకపోయారట. నాగ్ కోసం చిరు వస్తానని కమిటయ్యారని తాజా సమాచారం.

చిరుతో పాటు అంజలి, నిధి అగర్వాల్ కూడా హౌస్‌లోకి విచ్చేస్తారట. చిరు ఎంట్రీ ఇచ్చే టైమ్‌లో ఈ ఇద్దరు హీరోయిన్స్ సాంగ్‌తో వెల్‌కమ్‌ పలుకుతారట. అదే సమయంలో చిరు కూడా ఈ ఇద్దరు హీరోయిన్స్ తో స్టెప్స్ వేసి బిగ్‌బాస్ ప్రియులను కనువిందు చేస్తారట. అనంతరం చిరు చేతుల మీదుగానే విజేతగా నిలిచిన వారికి రూ.50 లక్షలు బహుమతి ఇస్తారట. ఇక.. ఇప్పటికే శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఎలిమినేట్ అయిన విషయం విదితమే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. వీళ్ళలో శ్రీముఖికే విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

చిరు హౌస్‌లోకి వచ్చే మాటే నిజమైతే మెగాస్టార్ అభిమానులకు డబుల్ ధమాకానే. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు, బిగ్‌బాస్ ప్రియుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయంటున్నారు.! సోషల్ మీడియా వేదికగా మెగాభిమానులు పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన వార్తలను, ఫొటోలను మిక్స్ చేసి నానా రచ్చ చేస్తున్నారు. మరి బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరి నిలుస్తారో..? చిరు చేతుల మీదుగా ఎవరు బహుమతి అందుకుంటారో తెలియాలంటే గ్రాండ్‌ ఫినాలే వరకు ఆగాల్సిందే.                    



మరింత సమాచారం తెలుసుకోండి: