నిజానికి ఒక డెబ్యూ హీరో సినిమా అందులోను స్టార్ హీరోకి బంధువు అన్నప్పుడు ప్రతీ విషయంలోను ఆచీ తూచీ వ్యవహరిస్తారు. అంతేకాదు కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో లాంచింగ్ సినిమా అయితే ఇక అన్నీ అందరితో డిస్కస్ చేసాకే నిర్ణయిస్తారు. ఇప్పుడు మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా సినిమా విషయంలోనూ అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా అశోక్‌ హీరోగా రూపొందనున్న డెబ్యూ సినిమా ఈ ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.  హీరో హీరోయిన్లు అశోక్, నిధి అగర్వాల్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్‌నిచ్చారు. మరో హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు.  

వాస్తవంగా ఆ మధ్య అశోక్ గల్లా ను లాంచ్ చేసే భాధ్యతను దిల్ రాజుని నమ్మి శశి అనే కొత్త దర్శకుడి చేతిలో పెట్టారు. అది లాంచ్ అయిన కొన్ని రోజులకే క్యాన్సల్ అయింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ నిర్మాత దిల్ రాజుకు అశోక్ పర్‌ఫార్‌మెన్స్ సంతృప్తికరంగా లేకపోవడంతో దిల్ రాజు సైడయ్యాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని యంగ్ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ విషయంలో బాగా హర్టయిన గల్లా ఫ్యామిలి ఎలాగైనా అశోక్ ని హీరోగా నిలబెట్టాలనే పట్టుదలకు వచ్చారు. ఇక అశోక్ డెబ్యూ సినిమా విషయంలో మహేష్ ఫ్యామిలీ మొత్తం ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆలోచించారట. ఆ సమయంలోనే శ్రీరామ్ ఆదిత్య ఓ యూత్ ఫుల్ కథతో వెళ్లి గల్లా ఫ్యామిలీని కలిసాడట. 

నిజానికి మహేష్ ఫ్యామిలీ హీరో సుధీర్ బాబుకి తొలి హిట్ ఇచ్చింది శ్రీరామ్ అదిత్యనే. 'ఎస్.ఎం.ఎస్' అనే సినిమాతో లాంచ్ అయిన సుధీర్ సక్సెస్ ఫుల్ జర్నీ మాత్రం 'భలే మంచి రోజు' సినిమా నుంచే మొదలైంది. అందుకే మహేష్ కూడా శ్రీరామ్ ఆదిత్యకే ఓటేశాడట. ఇక సుధీర్ కి సక్సెస్ సినిమా ఇచ్చి హీరోగా నిలబెట్టిన శ్రీరామ్ ఇప్పుడు అశోక్ కి కూడా డెబ్యూ సినిమాతోనే సూపర్ హిట్ ఇస్తాడని నమ్మి అందరూ ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారట. మరి ఘట్టమనేని గల్లా ఫ్యామిలీ పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీ రామ్ ఆదిత్య ఎంత వరకూ నిలబెట్టుకుంటాడో చూడాలి. ఇక ఎలాగైనా హిట్ కొట్టి చూపిస్తామంటు ఇన్‌డైరెక్ట్ గా దిల్ రాజుకి సవాల్ కూడా విసురుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: