ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే, ఫస్ట్ సినిమాతో పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకుంది. అయితే ఆమెకు కెరీర్ పరంగా సక్సెస్ రావడానికి చాలానే సమయం పట్టిందని చెప్పాలి. తెలుగులో కూడా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూజ, ఇటీవల మాత్రం వరుస విజయాలతో టాలీవుడ్ పాలిటి గోల్డెన్ లెగ్ భామగా మంచి పేరు దక్కించుకుని ముందుకు సాగుతోంది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలవైకుంఠపురములో, ప్రభాస్ జాన్, అఖిల్ కొత్త సినిమాలు ఉన్నాయి. 

 

ఇకపోతే ఆమె బన్నీతో కలిసి నటిస్తున్న అలవైకుంఠపురములో అతి త్వరలో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ విషయమై ఇప్పటికే ఫ్యాన్స్ తో తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలు ఫోటోలు షేర్ చేసుకున్న పూజ, నేడు తన ట్విట్టర్ అకౌంట్ లో అలవైకుంఠపురములో షూటింగ్ స్పాట్ లో యూనిట్ సభ్యులు అందరితో కలిసి సరదాగా దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ, కొంత ఎమోషనల్ గా ట్వీట్ చేసింది. ఇది సినిమా కాదు, వీళ్లంతా సినిమా నటులు కాదు, మేమందరం ఒక ఫ్యామిలీ, వీరితో గడిపిన రోజులు ఎప్పటికీ మరిచిపోలేను అంటూ పూజ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

 

ఇప్పటికే మహేష్ బాబుతో మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ వంటి రెండు వరుస సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న పూజ, ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి చేస్తున్న అలవైకుంఠపురములో సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి మరి. అల్లు అర్జున్ ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తుండగా, ఆ కంపెనీ సీఈవోగా పూజ హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: