జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వచ్చేసిన నాగబాబు.. ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ‘అంతా నా ఇష్టం’ ద్వారా మూడు వీడియోలను విడుదల చేయగా నేడు 22 నిమిషాల నిడివితో మరొక వీడియో విడుదల చేశారు.... వరుస వీడియోలతో షో నిర్వాహకుల్ని ఏకిపారేస్తున్నారు. ఏడేళ్లు పాటు కలిసి పనిచేసిన ఈటీవీ, మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేస్తూ వీడియో విడుదల చేశారు.
స్కిట్లో భాగంగా కమెడియన్ వేణు ఒక కమ్యునిటీని కించపరిచాడని.. మాట్లాడతాం అని ఫిల్మ్ ఛాంబర్కి పిలిపించి కొట్టారు. మీడియాను పిలిచి ఆ దాడిని ఖండించాం.జబర్దస్త్ వాళ్లకు ఏమైనా జరిగితే.. షో నిర్వహకుల నుండి సపోర్ట్ ఉండేది కాదు.. వాళ్లు మాట్లాడాలనే రూల్ లేదు కాని కొన్ని సందర్భాల్లో శ్యాం ప్రసాద్ కాని.. ఈటీవీ వాళ్లు కాని స్పందించి ఉంటే బాగుండేది. వాళ్లు ఏం అనుకున్నారో ఏమో కాని వేణు ఈ విషయంలో మానసికంగా కుంగిపోయాడు. తరువాత సెట్ అయ్యాడు.ఆ ఎఫెక్ట్ ప్రతి కంటెస్టెంట్, టీం లీడర్ మీద పడింది.
ఈ ఇష్యూ తరువాత ఏదైనా స్కిట్ చేయాలంటే టీం లీడర్, కంటెస్టెంట్స్ భయపడేవారు. వాళ్లకు నేను ధైర్యం చెప్పా. ఏదైనా తప్పు ఉంటే మనం ఫైట్ చేద్దాం, ధైర్యంగా చేయండని చెప్పా. అయితే ఛానల్ నుండి కొన్ని నిబంధనలు వచ్చాయి. పలానా వాళ్ల గురించి మాట్లాడకూడదు.. పలానా ఇష్యూస్పై స్పందించకూడదు అని. ఎవరో మనోభావాలు దెబ్బతింటాయని సైలెంట్గా ఉండాలా? లీగల్గా సమస్యలు వస్తే కోర్టులు ఉన్నాయి కదా.జబర్దస్త్ ఎపిసోడ్లకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఛానల్ మీద కేసు వస్తే ఫైట్ చేస్తారు.. వ్యక్తిగతంగా ఏదైనా జరిగితే పట్టించుకోలేదు.
ఇంత పెద్ద షోలో ప్రొడక్షన్స్ వాల్యూస్ దారుణంగా ఉండేవి. జబర్దస్త్లో పనిచేసేవాళ్లు మల్లెమాల బాగుకోసమే కష్టపడేవాళ్లు. కాని టీం లీడర్స్ గురించి పట్టించుకునేవాళ్లు కాదు. టీం వాళ్లకి నిర్వాహకులకు మధ్య దళారులు ఉన్నారు. ఇవన్నీ శ్యాం గారికి తెలియదు అనే నేను అనుకుంటున్నా.. తెలిసి జరిగితే నేను ఏం చేయలేను. నన్ను బాగానే చూసుకున్నారు కాని మిగతా టీం వాళ్లకు ఫుడ్ కూడా సరిగా పెట్టేవారు కాదు.. మినిమమ్ ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా రాను రాను మరీ తగ్గించేశారు’ అంటూ జబర్దస్త్ షోపై అసహనం వ్యక్తం చేశారు నాగబాబు.