తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటు వయసులో కూడా చాలా స్పీడ్ గా ఉన్నారు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటించిన దర్బార్ షూటింగ్ పూర్తయింది. వెంటనే ఆయన మరో సినిమాని లైన్లో పెట్టేసారు. అజిత్‌తో వరుస సినిమాలు తెరకెక్కించిన శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'తలైవార్ 168' గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభంకానుందని తెలుస్తోంది. దర్శకుడు శివ మాస్‌, కమర్షియల్‌ అంశాలతో రజనీ ఇమేజ్ కు తగ్గ కథను రాసుకుని రజనీకాంత్‌ ను ఒప్పించగలిగారు.

 

 

ఈ సినిమాకు ‘తలైవర్‌ 168’ అని వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. కీర్తిసురేష్‌ ఈ సినిమాలో రజనీ సరసన నటించనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. సినిమాలో మెయిన్ విలన్ గా ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, సూరి వంటి వారు నటిస్తూండడం విశేషం. భారీ తారగణంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శివ. ఇంత పెద్ద క్యాస్టింగ్ తో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ లో రజనీకాంత్‌, కీర్తిసురేష్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రెండో షెడ్యూల్‌ను చెన్నైలో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

 

 

మీనా మాట్లాడుతూ.. ‘రజనీకాంత్‌ 168వ చిత్రంలో నేను కూడా నటిస్తున్నా. 23 సంవత్సరాల తర్వాత రజనీతో తెరపై కనిపించనున్నా. ఈ విషయం చాలా సంతోషాన్నిస్తోంది. మంచి పాత్రలో కనిపించే అవకాశం వచ్చింది. షూటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అంటోంది. రజనీకాంత్‌, మీనా కాంబినేషన్‌లో 1996లో 'ముత్తు’ వచ్చింది. ఖుష్బూ, రజనీకాంత్‌ కలిసి 27 ఏళ్ల క్రితం ‘పాండియన్‌’లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం. సూరి హాస్య పాత్రలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: