ఈ యేడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించడానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు మహేష్. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
ఇటీవల విడుదల అయిన టీజర్.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. కేవలం 40 గంటల్లో 20 మిలియన్లకు పైగా రియల్టైమ్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. మరియు డిసెంబర్ మొదటి వారం నుంచీ ప్రతి సోమవారం ఈ చిత్రంలోని ఒక్కో పాటని రిలీజ్ చేస్తూ సినిమాకి మరింత క్రేజ్ తెస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఒకసారి ఈ చిత్ర టీం రిలీజ్ చేయకముందే ఈ సినిమాలోని చాలా ఫొటోస్ నెట్లో హల్చల్ చేశాయి. దాంతో చిత్ర టీం అలర్టై.. చాలా కష్టపడి ఎలాగోలాగా వాటికి చెక్ పెట్టాయి. అయితే ప్రస్తుతం ‘మైండ్ బ్లాక్’ సాంగ్ టైంలోని ఓ వీడియో నెట్ లో హల్చల్ చేస్తోంది.
వాస్తవానికి రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి లేక్స్ సినిమాకి ఒక విధమైన డామేజ్ అని చెప్పాలి. సరిలేరు నీకెవ్వరు చిత్ర టీం ఎంత జాగ్రత్త పడుతున్నా.. ఇలాంటి లీక్స్ రూపంలో ఏదో ఒకటి బయటకి వస్తూనే ఉంది. మరి ఈ సారి వాటిని ఎలా అడ్డుకుంటారో చూడాలి. కాగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. అలాగే.. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, అజయ్, బండ్ల గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.