సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. పటాస్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన అనిల్, ఆ తరువాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని కెరీర్ లో ఒక్క అపజయం కూడా లేని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ తో తీసిన సరిలేరు నీకెవ్వరు పై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ లో కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా యావరేజ్ అని కొందరు ప్రేక్షకులు అంటున్నారు.
ముందుగా మంచి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ని నడిపించిన దర్శకుడు అనిల్, సెకండ్ హాఫ్ లో కూడా మహేష్ తో అవసరం ఉన్నా, లేకున్నా కొన్ని కామెడీ డైలాగ్స్ చెప్పించాడట. అలాగే కీలకమైన విలన్ తో వచ్చే ఎపిసోడ్స్ లో కూడా దర్శకుడు అనిల్ కామెడీని జొప్పించడం జరిగిందని, ఆ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవని అంటున్నారు. సినిమాలో కామెడీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, సరైన కథను ఎంచుకోవడం, దానిని ముందుకు నడిపించడంలో అనిల్ రావిపూడి పెద్దగా సక్సెస్ కాలేదని అంటున్నారు. ఇప్పటి వరకు వెంకీ లాంటి సీనియర్ హీరోను మినహా ఏ పెద్ద హీరోను అనిల్ డీల్ చేయలేదు. తొలిసారిగా ఆయనకు సూపర్స్టార్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే దానిని కొంత వరకు మాత్రమే ఊపయోగించుకున్నాడు అనిల్.
తనదైన స్టైల్లోనే కామెడీ సీన్లు రాసేసుకుని మామూలు కథ ఫ్రేములో మహేశ్ను ఇరికించేశాడని అంటున్నారు. ఇక ఈ సినిమాపై భారీ ఆశలతో ఉన్న మహేశ్కు, ఆయన ఫ్యాన్స్కు ఇది నచ్చినా, అంత భారీ అంచనాలు మాత్రం అందుకునేంత గొప్ప సినిమా కాదని అంటున్నారు. ఇంతకు ఈ సినిమా మహేష్, అనిల్ లలో ఇద్దరిలో ఎవరిది అన్న ప్రశ్న వేసుకుంటే అది అనిల్ స్టైల్ సినిమాయే అవుతుందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా ఫక్తు యావరేజ్ సినిమాగా మిగిలే అవకాశం ఉందని అంటున్నారు....!!