టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులు కామెడీ సినిమాలతో అలరించారు. అయితే కామెడీ సినిమాలు తీయడంలో ఓ ప్రత్యేకత చాటుకున్నారు హాస్య బ్రహ్మా జంద్యాల. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్లో హాయిగా.. ఉల్లాసంగా నవ్వుకోవడానికి వెళ్లేవారు. ఆయన తెరకెక్కించిన అహ నా పెళ్ళంట మూవీతో ప్రస్తుతం కామెడీకే కొత్త భాష్యం చెప్పిన బ్రహ్మానందం పరిచయం అయ్యారు. దర్శకులు జంద్యాల సీనియర్ నరేష్, ప్రదీప్, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు లాంటి గొప్ప హాస్యనటులను వెండి తెరకు పరిచయం చేశారు. జంద్యాల తర్వాత ఆ తరహా తనదైన కామెడీ ముద్ర వేశారు ఈవీవీ సత్యనారాయణ. ఆయన తెరకెక్కించిన జంబలకిడిపంబ మూవీ బుల్లితెరపై వస్తే పగలబడి నవ్వుకుంటారు.
అ హాస్య దర్శకుల తర్వాత అనీల్ రావిపూడి తనదైన కామెడీ ముద్ర వేసుకుంటున్నారు. రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన అనీల్ రావిపూడి.. తర్వాత దర్శకుడిగా మారి పటాస్, సుప్రీమ్, రాజాది గ్రేట్, ఎఫ్ 2 మూవీస్ లాంటి కామెడీ మూవీస్ తో అలరించారు. ఈ సంక్రాంతి కానుకగా మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరు’ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కాలేజ్ రోజుల్లో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు.
మాస్నేహితుడిని తన ఊళ్లో డ్రాప్ చేసి తిరిగి వచ్చే సమయంలో కాస్త పొద్దు పోయింది. అయితే ఆ ఊరి నుంచి మా ఊరికి పొలాల మధ్య గల దారిలో నుంచి రావాలి. అక్కడ కొన్ని సమాధులు వున్నాయి. వాటిని చూడగానే చిన్నపుడు మా నాన్న దెయ్యాల గురించి చెప్పారు.. అది గుర్తుకు వచ్చి చచ్చేంత భయం వేసింది. పోనీ త్వరగా రావాలంటే రోడ్డంతా గుంతలు.. నా ఖర్మ కొద్ది అదే సమయంలో బైక్ రిపేర్ అయ్యింది. అప్పుడు నా పరిస్థితి వర్ణాతీతం.. మొత్తానికి ఎలాగో అలా ఇంటికి చేరుకున్నాను. మరోసారి అటువైపు వెళ్లలేదు.