2020 ఎలా ఉంటుందో అని అందరు అనుకున్నారు. ఈ ఏడాది మంచి సినిమాలు రిలీజ్ కావాలని, టాలీవుడ్ పరిశ్రమ మంచి ఆదాయంతో, మంచి సక్సెస్ రేట్ తో కళకళలాడాలని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ ఏడాది పాజిటివ్ గానే మొదలైంది. ఈ ఏడాది మొదట్లో చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. అందులో వర్మ నిర్మించిన బ్యూటిఫుల్ జనవరి 1 న వచ్చింది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమా చప్పగా ఉండటంతో ఫెయిల్ అయ్యింది.
వర్మ సినిమా ఫెయిల్ అయ్యింది కాబట్టి ఈ ఏడాది మొత్తం ఖచ్చితంగా పాజిటివ్ గా నడుస్తుందని అనుకున్నారు. సంక్రాంతి సీజన్ లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి సినిమా దర్బార్ కాగా, రెండో సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఆ తరువాత వచ్చిన సినిమా అల వైకుంఠపురంలో, రెండు రోజుల గ్యాప్ తరువాత ఎంత మంచి వాడవురా సినిమా వచ్చింది. ఈ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అని చూసుకుంటే మంచి విజయం సాధించయని చెప్పొచ్చు.
దర్బార్ సినిమా తమిళనాడులో లాభాల బాటలో పయనిస్తోంది. అక్కడ 800 థియేటర్లలో రిలీజైన ఈ మూవీ టాప్ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్నది. ఈ సినిమా చంగల్పట్టు, చెన్నై ఏరియాల్లో ఇప్పటికే లాభాలు వస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సినిమా టాప్ వసూళ్లతో దూసుకుపోతున్నది. ఇకపోతే ఈ సినిమా తరువాత వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ కూడా వసూళ్ల విషయంలో రికార్డు సాధిస్తున్నది.
ఇప్పటికే ఈ మూవీ వందకోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కావడంతో పాటుగా నైజంలో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు మహేష్ బాబు. దీని తరువాత బన్నీ అల వైకుంఠపురంలో రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కంటే ముందే మ్యూజికల్ గా హిట్ అనిపించుకున్న ఈ మూవీ, వసూళ్ల పరంగా కూడా అదే రేంజ్ లో పయనిస్తోంది. బన్నీ త్రివిక్రమ్ పై ఉంచిన నమ్మకం ఈ సినిమా వమ్ము చేయలేదు. ఈ మూవీ అనంతరం జనవరి 15 న కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా వచ్చింది. అయితే, కంటెంట్ బాగున్నా కూడా సినిమా మరీ స్లో నేరేషన్ కావడంతో విజయం సాధించలేకపోయింది. మొత్తానికి ఈ జనవరి సీజన్లో వసూళ్లు బాగున్నాయి. ఈనెల 24 వ తేదీన మాస్ మహారాజ డిస్కోరాజా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై కూడా బోలెడు ఆశలు ఉన్నాయి.