పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఫస్ట్ మూవీ తో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అలానే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీం సినిమాలతో రెండు భారీ విజయాలు దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుండి తేజ్ కు వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి, అయితే అతడు మాత్రం వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆ సినిమాలు అన్ని కూడా వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. 

 

ఇక ఇటీవల కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన చిత్రలహరి సినిమాతో మళ్ళి ఫామ్ లోకి వచ్చిన తేజ్, కొద్దిరోజుల క్రితం యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతి రోజు పండగే సినిమాతో మరొక సక్సెస్ ని అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఒక వెరైటీ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోయాయని, కాసేపటి క్రితం సాయి తేజ్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ చెప్పాడు. 

 

ఇటీవల తనకు థమన్ స్వరపరిచిన అలవైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ ఎంతో బాగున్నాయని చెప్పిన సాయి తేజ్, తన సినిమాకు కూడా థమన్ ఇరగదీసే సాంగ్స్ ని అందించాడని, తప్పకుండా ఈ సినిమాలోని సాంగ్స్ కొన్నాళ్ల పాటు అలాగే శ్రోతల మనస్సులో నిలిచిపోతాయని తన పోస్ట్ ద్వారా తెలిపాడు. ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న థమన్ తప్పకుండా ఈ మూవీ సాంగ్స్ అదరగొట్టి ఉంటాడని, ఎప్పుడెప్పుడు సాంగ్స్ వింటామా అని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ సోషల్ మీడియా అకౌంట్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా మే 1 న ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: