సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ప్రఖ్యాతులు గురించి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ ఓ సాహస యాత్ర చేయబోతున్నారు. అడవుల్లో సాహసయాత్రలు చేసే ఇంగ్లండ్ కు చెందిన బేర్ గ్రిల్స్ తో ప్రధాని మోదీ గతంలో ఓ ఫారెస్ట్ అడ్వంచర్ చేసిన సంగతి తెలిసిందే. మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో ఈ డాక్యుమెంటరీని గత ఏడాది చేశారు. ఇప్పుడు అదే అడ్వంచర్ ను బేర్ గిల్స్ తో కలిసి రజినీకాంత్ చేస్తున్నారు. ఇందుకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతంలోని బండీపూర్ అభయారణ్యాన్ని ఎంపిక చేసుకునక్నాడు బేర్ గ్రిల్స్.
మోదీతో చేసిన అడ్వెంచర్ కి ఉత్తరాఖండ్లోని జాతీయ పార్కును ఎంచుకున్న బేర్ గ్రిల్స్ రజనీతో మాత్రం బండీపూర్ టైగర్ రిజర్వ్ జోన్ను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ అడ్వెంచర్ ను మంగళ, బుధ, గురు వారాల్లో చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని బండీపూర్ ఫారెస్ట్ డైరక్టర్ టి. బాలచంద్ర తెలిపారు. ఈ అడ్వెంచర్ కోసం కర్ణాటక అటవీ శాఖ బేర్గ్రిల్స్ కు 17 నిబంధనల్ని విధించారని అన్నారు. భారీ క్రేన్లను, వాహనాలను అనుమతించటం లేదని అన్నారు. కొంతమంది సిబ్బంది, అవసరమైన కెమెరాలు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటికే రజినీకాంత్, బేర్ గిల్స్ ఈ అభయారణ్యానికి చేరుకున్నారని అన్నారు. రోజులకు ఆరు గంటల పాటు ఈ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. మంగళ, బుధవారాలు మాత్రం రజనీకాంత్ పై షూటింగ్ చేస్తారని అంటున్నారు. గురువారం రోజు ఈ షూట్ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. మంగళ, బుధవారం రజనీపై సోలోగా షూట్ చేసి గురువారం అక్షయ్, రజనీలపై బేర్ గిల్స్ టీమ్ డాక్యుమెంటరీని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇటువంటి అడ్వెంచర్ ను ప్రధాని మోదీ తర్వాత రజినీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.