టాలీవుడ్ లో శ్రీరెడ్డి తెరపైకి తీసుకు వచ్చిన కాస్టింగ్ కౌచ్ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లేవనెత్తిన మీ టూ ఉద్యమానికి కూడా భారీగానే స్పందన వచ్చింది. ఇక కోలీవుడ్ లో ప్రముఖ సింగర్ చిన్మయి తనను పదేళ్ల క్రితం ప్రముక రచయిత వైరా ముత్తు లైంగిక వేధింపులకు గురి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోలీవుడ్ లో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది.. ఈ నేపథ్యంలో ఆమెను డబ్బింగ్ యూనియన్ కూడా తొలగించారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి మళ్లీ సంఘంలో చోటు దక్కించుకున్నారు. తాజాగా తమిళ సినీ పరిశ్రమలో డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరిగాయి.
ఈ క్రమంలో సింగర్ చిన్మయి కూడా నామినేషన్ వేసింది. తాజాగా డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా సీనియర్ నటుడు రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంఘం ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. అధ్యక్ష పదవికి మళ్లీ రాధారవి నామినేషన్ దాఖలు చేశారు. ఇక మీ టూ ఉద్యమం నేపథ్యంలో కొంత కాలంగా రాధా రవి వర్సెస్ చిన్మయికి పెద్ద గొడవలే జరుగుతున్నాయి. రాధారవిపై చిన్మయి మీటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమెను యూనియన్ నుంచి తప్పించారు. కాగా బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరష్కరించారు.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్ తిరష్కరణపైనా, రాధారవి ఏకగ్రీవ ఎంపికపైనా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. దీని గురించి ఆమె గురువారం మీడియా ముందుకు రానున్నారు. ఆడవారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటం తాను చేసిన తప్పా.. అయితే వేనుకడుగు వేసే ప్రసక్తే లేదని అంటున్నారు చిన్మయి.