టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావటంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు సూపర్‌ స్టార్‌. ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించేశాడు. మహేష్ హీరోగా మహర్షి లాంటి క్లాస్‌ మూవీని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నాడు మహేష్.

 

అయితే సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్‌ స్టార్‌, అక్కడే తన మోకాలి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. కొద్ది రోజుల విశ్రాంతి తరువాత తిరిగి ఇండియాకు రానున్నాడు. అయితే పూర్తి స్థాయిలో కోలుకొని షూటింగ్‌లకు  హాజరు కావడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుందని తెలుస్తుంది.

 

అంటే మూడు నెలల తరువాత మహేష్ కొత్త సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్‌ స్టర్‌ తరహా పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు మహేష్ బాబు కెరీర్‌లో తొలిసారిగా ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడట. సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన భాషా సినిమా లాగే ఈ సినిమా కథ ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది.

 

అంతేకాదు ఈ సినిమాలో మహేష్, బాండ్‌ తరహా స్పై పాత్రలో నటిస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఒక పాత్ర డాన్‌ అయితే మరో పాత్ర స్పై లా కనిపిస్తాడా..? లేక ఒకే పాత్రలో రెండు వేరియేషన్స్‌ చూపిస్తాడా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తుండగా శృతిహాసన్‌ కీలక పాత్రలో నటించనుందన్న టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: