ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఈ విషయం అందరికీ తెలసిందే. అయితే అది కథ కథనాలు ఎంచుకునే విషయంలో రజనీ వెనకపడ్డాడా అనే విషయాలు పక్కన పెడితే ఇప్పుడు రజనీ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడుతున్నారు. మరి దీని పై వైఎస్సార్సీపీ రోజా భర్త సెల్వమణి కొన్ని సంచలన కామెంట్లను చేశారు. అవేమిటంటే... దర్బార్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు నష్టం రావడంతో ఆ విషయం పై దర్శకుడు మురుగదాస్ను టార్గెట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. హీరోలు, నిర్మాతలతో వివాదాలు ఉంటే టెక్నీషియన్లను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదన్నారు. రజినీకాంత్ హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నిరాశను మిగిల్చింది. యావరేజ్ టాక్ వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ ఇమేజ్తో కచ్చితంగా ఆడుతుందనుకున్నారు కానీ మ్యాజిక్ రిపీట్ కాలేదు. వీరిద్దరి కాంబినేషన్ అద్భుతం అనుకున్నా కూడా అక్కడ ఎలాంటి అద్భుతం జరగలేదు. ఎప్పటిలానే మళ్ళీ ఆయన సినిమాకి అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.
ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన దర్బార్.. కనీసం 100 కోట్లు షేర్ కూడా తీసుకురాలేదు. కేవలం తమిళనాడులోనే 64 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు వచ్చింది 37 కోట్లు మాత్రమే. దాంతో ఎటు చూసుకున్నా కూడా దర్బార్ సినిమా భారీగానే నష్టాలు తీసుకొచ్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు ఏం చేయాలో అర్ధం కాక రజనీకాంత్ని కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. రజనీ దీని పై ఎలాంటి స్పందన చూపలేదు. ఇక ఇదే విధంగా మురుగుదాస్ని కూడా టార్గెట్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు అయినప్పటికీ అక్కడ కూడా వీళ్ళ పప్పులేమీ ఉడకలేదు.
ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటీవలె తమిళనాడు దర్శకుల సంఘానికి సెల్వమణి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఈ విషయం పై ఆయన స్పందించారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమాను నిర్మాతల దగ్గరి నుంచే కొనుక్కుంటారు. ఒకవేళ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే వారికి వచ్చిన లాభాల్లో నుంచి హీరోలకు, దర్శకులకు అయితే ఎటువంటి సంబంధం ఉండదు కదా. దాని నుంచి ఏమైనా డబ్బులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ సినిమా నష్టాలను మిగిల్చినా మరో మార్గంలో దాన్ని భర్తీ చేసుకోవచ్చనే ముందస్తు ఆలోచన లేకుండా ఏ డిస్ట్రిబ్యూటరు బరిలోకి దిగరు. అసలు ఇలాంటి ట్రెండ్ సెట్ చేసింది రజినీకాంత్ (డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి చెల్లించడం) అని అన్నారు. ఆయన చేసిన భారీ తప్పు వల్లే ఇవాళ ఈ పరిస్థితి నెలకొందన్నారు. దర్శకులతో డిస్ట్రిబ్యూటర్లు ఈ తరహాలో ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదన్నారు.
ఇక ఇదిలా ఉంటే మరోపక్క దర్శకుడు మురుగుదాస్ తనకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి హాని ఉందని కోర్టును ఆశ్రయించారు. దర్బార్ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారనిదానికి ఆయన బాధ్యుడ్ని కాదని చెప్పుకొచ్చారు.