తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో తల అజిత్ ఒకరు. ఆయన నటించే చిత్రాలు వస్తున్నాయంటే అక్కడి అభిమానులు పండుగ చేసుకుంటారు. వాస్తవానికి అజిత్ అచ్చమైన తెలుగు నటుడే.. కానీ పెళ్లిపుస్తం చిత్రం తర్వాత అజిత్ తమిళ నాట అడుగు పెట్టి అక్కడే స్థిరపడిపోయారు. కాకపోతే అజిత్ నటించిన చిత్రాలు ఇక్కడ డబ్ అవుతూ మంచి విజయాలు అందుకుంటున్నాయి. తన సహనటి షాలిని వివాహం చేసుకున్న అజిత్ ఎంతో నేచురల్ గా చిత్రాల్లో కనిపిస్తుంటారు. ఇక గత ఏడాది నందమూరి బాలకృష్ణ తో కేఎస్ రవికుమార్ ‘రూలర్’ మూవీ తెరకెక్కించారు.
ఎన్నో అంచాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. గతంలో వీరి కాంబినేషన్ లో జయసింహ చిత్రం కూడా పెద్దగా టాక్ తెచ్చుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు కేఎస్ రవికుమార్ తో అజిత్ ఓ చిత్రం చేయబోతున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. తమిళనాట ఒకప్పుడు రవికుమార్ మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. తమిళంలో స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆలోచనలో పడుతున్న పరిస్థితుల్లోనే ఆయన తెలుగుపై దృష్టి పెట్టి, బాలకృష్ణతో 'జై సింహా' .. 'రూలర్' చిత్రాలను తెరకెక్కించాడు. కానీ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
తాజాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో అజిత్ ఓ చిత్రం చేయడానికి ఒప్పుకున్నారట. ఈ విషయాన్ని కేఎస్ రవికుమార్ స్వయంగా తెలియజేశాడు. చాలాకాలం క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో 'విలన్' చిత్రం వచ్చింది. అప్పట్లో ఆ చిత్రం పెద్ద హిట్ అయింది .. అజిత్ స్థాయిని పెంచింది. గతంలో తనకి లైఫ్ ఇచ్చిన దర్శకుల కెరియర్ ఇబ్బందుల్లో పడినప్పుడు అజిత్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్న సందర్భాలు చాలానే వున్నాయి. ఇప్పుడు వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న కెఎస్ రవికుమార్ తో అజిత్ చిత్రం అంటే భారీ అంచనాలే నెలకొన్నాయి.