తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఈ రౌడీ హీరో తర్వాత పెళ్లిచూపులు చిత్రంతో మంచి హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత వంగ సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేషన్ హీరోగా మారిపోయాడు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేరవకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీతాగోవిందం’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ దేవరకొండకు ఒక్కసారే స్టార్ హీరో గా గుర్తింపు వచ్చింది.
ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండకు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. కానీ చాలా సెలెక్టడ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఈ యంగ్ క్రేజీ హీరో. గీతాగోవిందం చిత్రం తర్వాత టాక్సావాలా లాంటి హర్రర్, థ్రిల్లర్ జోనర్ లో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు. అయితే ఈ గీతాగోవిందం, టాక్సీవాలా రెండూ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కాయి. ఇక 'గీత గోవిందం' కొత్త ట్రెండ్ ను సృష్టించడమే కాకుండా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఇక విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రూపొందిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయాలనే ఆసక్తితో వున్నట్టుగా చెప్పారు. విజయ్ దేవరకొండ ఓకే అంటే తన వైపు నుంచి ఎలాంటి ఆలస్యం ఉండదని అన్నారు. ఒకవేళ ఇదే జరిగితే ముచ్చటగా మూడోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ మరో చిత్రం రాబోతుందనని అనుకుంటున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.