కొరటాల శివ అంటే.. ఎవరైనా టక్కున ఓ సూపర్ డైరెక్టర్ అంటారు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల శివ ఎన్నో కష్టాలు ఎదుర్కొని తక్కువ సినిమాలతో స్టార్ డైరెక్టర్ల చెంత చేరాడు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రాజమౌళి తర్వాత ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. వాస్తవానికి బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. రవితేజ భద్ర సినిమాకు రచయితగా కథ అందించాడు. అలాగే ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు.
అలా అప్పటి వరకు రచయితగా రాణించిన కొరటాల సొంతంగా కథ రాసుకుని 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాక ఇటు కొరటాలకు.. అటు ప్రభాస్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు. అయితే ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు నాలుగే. 2013లో ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించాడు.
కాని, ఈ నాలుగు సినిమాలు మంచి విజయం సాధించి.. ఆ హిరోలకు సూపర్ డూపర్ హిట్ అందించాడు కొరటాల. అలాగే సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు. దాంతో ఇప్పుడు సినిమాకు 20 కోట్ల వరకు పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు ఈ దర్శకుడు. మరి ఈయన సినిమాలకు కంప్లైంట్ ఏంటీ అంటే.. ప్రతి సినిమా కథనం స్లోగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనికి కొరటాల మాత్రం సినిమా అంటే అలాగే ఉంటుంది నిర్మహమాటంగా చెప్పేస్తారు. వాస్తవానికి ఇదో పెద్ద కంప్లైంట్ అయితే కాదు కానీ.. దీనిపై చాలా మంది చెబుతుంటారు. కాగా, ప్రస్తుతం కొరటాల చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.