అల్లు అర్జున్.. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచనల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్కు ఈ మెగా హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా ఓ చిత్రం పట్టాలెక్కింది. ఇప్పటికే బన్నికి అర్య, ఆర్య2తో రెండు బ్లాక్బస్టర్ హిట్లు అందించిన సుకుమార్ తాజాగా ఈ స్టైలీష్ స్టార్తో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్గా ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ కూడా కంప్లీటైంది. రెండో షెడ్యూల్ను ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీతో పని చేసేందుకు దర్శకులు మురుగదాస్, వేణు శ్రీరామ్ ముందుకొచ్చారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ అయితే కాస్త దూకుడుగా ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ను కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం వేణు శ్రీరామ్.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో.. బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ చేస్తున్నాడు.
ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందించనున్నాడు. ఇటీవలే ‘పింక్’ రీమేక్ షూటింగ్ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే, ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక షూటింగ్ను త్వరగా పూర్తి చేసి సమ్మర్లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ఫలితాన్ని చూసి అల్లు అర్జున్ ‘ఐకాన్’పై నిర్ణయం తీసుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది.