మెగా స్టార్ చిరంజీవి తన భార్య సురేఖను పెళ్ళి చేసుకుని 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిద్దరూ అనేక ఆసక్తికర విషయాలను షేరు చేసుకున్నారు. అంతేకాదు సురేఖను పెళ్లి చేసుకోవడం ద్వారా తాను బలిపశువు ఎలా అయ్యాడు అన్న విషయాలను కూడ చిరంజీవి చాల సరదాగా వివరించాడు.
ఈ ఇంటర్వ్యూ నిర్వహించిన వ్యక్తి ‘శుభలేఖ’ రాసుకున్న విశేషాల గురించి చెప్పాలని చిరంజీవిని అడిగిన వెంటనే ‘అంటే మీరడుగుతున్నది నాకు నేనుగా బలి పశువును అయిన రోజు గురించేనా’ అంటూ జోక్ చేస్తూ చిరంజీవి తన పెళ్ళి విషయాలను గుర్తు చేసుకున్నాడు. వాస్తవానికి తన మామ అల్లు రామలింగయ్యకు తన కూతురిని ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాలని కోరికతో ఉండేవారు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు చెడు అలవాట్లు లేవని ఆంజనేయస్వామి భక్తుడినని బాగా చదువుకోవడంతో పాటు బాగా కష్టపడతాననే ఫీడ్ బ్యాక్ రావడంతో అల్లు అరవింద్ బలవంతం పై తనకు సురేఖ తో పెళ్లి జరిగిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.
ఇదే సందర్భంలో తన పెళ్ళినాడు జరిగిన సంఘటన గుర్తుకు చేసుకుంటూ పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు తన చొక్కా చిరిగిపోయిందని సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అంటూ అప్పటికే తనకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉందని చెప్పగానే పెళ్ళి పీటల పై సురేఖ షాక్ అయిన విషయాన్ని బయట పెట్టాడు.
ఇక పవన్ కళ్యాణ్ తో సురేఖ తన బంధం గురించి మాట్లాడుతూ పవన్ తన వద్ద ఒక కొడుకులా పెరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అతడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ తనకు ఇంకా తన కొడుకు లాగే కనిపిస్తాడు అంటూ కామెంట్ చేసింది. తమ పెళ్ళి జరిగిన కొత్తలో తామిద్దరం ప్యారిస్ కు వెళ్ళినప్పుడు చిరంజీవి తనను సురేఖ అని పిలవకుండా అప్పట్లో తనను ‘జయ’ అంటూ పిలిచే వారని అంటూ ‘ఏవండీ నేను సురేఖ ను’ అని గుర్తు చేస్తే చిరంజీవి ‘ఓ సారీ సారీ రేఖ’ అన్నప్పుడు చిరంజీవికి ఉన్న మతిమరుపును చూసి తాను షాక్ అయిన అనేక విషయాలను సురేఖ గుర్తుకు చేసుకుంటూ ఉంటే చిరంజీవి తెగ నవ్వుకున్నాడు..