రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుడు మోహన్ భగవత్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా చదువుకున్న వారిలోనే విడాకులు తీసుకుంటున్న వారు ఉన్నారన్నారు మోహన్ భగవత్. అయితే ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఖండించింది. వివరాల్లోకి వెళితే.. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అహమదాబాద్ లో కొంతమంది వర్కర్స్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉన్నత వర్గాల్లో చదువుకున్న వారిలో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయన్నారు.
అయితే ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు భగవత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ నటి, సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురు.. సోనమ్ కపూర్ ప్రముఖులు బయటకు వచ్చి భగవత్ వ్యాఖ్యలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలివిగల వ్యక్తులు ఎవరూ ఇలా మాట్లాడరు? ఇదో మూర్ఖపు ప్రకటన! అంటూ కామెంట్ చేశారు. బాలీవుడ్లో స్టైల్ ఐకాన్ గా బోల్డ్ కాస్ట్యూమ్స్ తో పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించే సోనమ్, సోషల్ మీడియాలోనూ అంతే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల త జోయ ఫ్యాక్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ఓ కొరియన్ థ్రిల్లర్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సోనమ్ అంధురాలిగా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బయోపిక్ గా తెరకెక్కిన నీర్జా సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్, తన నెక్ట్స్ సినిమాతోనూ అలాంటి ప్రయోగమే చేస్తోంది.
Which sane man speaks like this? Regressive foolish statements https://t.co/GJmxnGtNtv
— Sonam K Ahuja (@sonamakapoor) February 16, 2020