ఇండియన్ సినిమా హిస్టరీలో క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న సినిమాల్లో మిస్టర్ ఇండియా ఒకటి. 1987లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత రీమేక్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా సుల్తాన్, టైగర్ జిందాహై లాంటి సినిమాలు తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన మిస్టర్ ఇండియా సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రీమేక్ మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. మరోసారి ఓ సూపర్ హీరోను భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఎక్కువగా యాక్షన్ చిత్రాలను మాత్రమే తెరకెక్కించినా అలీ ఈ ఫాంటసీ డ్రామాను ఎలా డీల్ చేస్తాడా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఈ సినిమాల రణవీర్ సింగ్, షారూఖ్ ఖాన్లు కలిసి నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై దర్శకుడు స్పందించాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే జరుగుతుందన్న జాఫర్, ఇంకా నటీనటుల ఎంపిక ప్రారంభించలేదని తెలిపాడు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత నటీనటుల ఎంపిక మొదలు పెడతానని తెలిపాడు. అయితే సినిమాకు ప్రీ ప్రొడక్షన్కు చాలా సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒరిజినల్ సినిమాను యథాతదంగా తీసుకోకుండా ఒరిజినల్ సినిమా లైన్ మాత్రమే తీసుకొని ఈ జనరేషన్కు ప్రస్తుతం ఉన్న సాంకేతికతకు అనుగుణంగా సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు.
మిస్టర్ ఇండియా సినిమా అనాథలను చేర దీసిన ఓ పేద వ్యక్తి కథ. అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఆ వ్యక్తి అతని తండ్రి తయారు చేసిన ఓ డివైస్ను గుర్తిస్తాడు. దాని సాయంతో మాయం అవ్వవచ్చని తెలుసుకుంటాడు. ఆ డివైస్ సాయంతో ముగాంబే అనే విలన్ నుంచి ఈ అనాథ పిల్లలను ఎలా రక్షించాడు అన్నదే సినిమా కథ.