పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో ఘన విజయం సాధించిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ పోషిస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయినట్టుగా సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది.
ఒరిజినల్ వర్షన్లో అమితాబ్ పోషించిన పాత్రకు ఎక్కడ అనవరమైన బిల్డప్లు గానీ హీరోయిజం గానీ ఉండదు. ఓ మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న లాయర్, ముగ్గురు యువతుల కోసం ఓ కేసును వాదించటమే ఈ సినిమా కథ. ఇదే సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేసిన అజిత్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. అనవసరపు హీరోయిజం జోలికి వెళ్లకుండా ఒరిజినల్లోని ఫ్లేవర్ దెబ్బ తినకుండా సినిమాను రూపొందించాడు. రెండు భాషల్లోనూ హీరో పాత్రలకు హీరోయిన్ ఉండదు. అక్కడ కూడా పింక్ రీమేక్ ఘనవిజయం సాధించింది.
అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా కథకు మార్పులు చేస్తున్నారట. పవన్ ఇమేజ్కు తగ్గట్టుగా హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలను జోడిస్తున్నారట. అంతేకాదు చాలా కాలం తరువాత పవన్ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో అన్ని రకాల మసాల అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే పవన్కు హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ హంగులతో అసలు కథ దెబ్బతింటుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి పవన్ ప్రయోగం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.