యువ కథానాయకుడు నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన సినిమా భీష్మ. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. నితిన్ గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోకపోవటంతో ఈ సినిమా ఈ విషయంలో భారీ అంచనాలేవి లేవు. దీంతో బిజినెస్ పరంగానూ సినిమా మీద ప్రభావం ఉంటుందని భావించారు. అయితే నిర్మాణ సంస్థపై ఉన్న అంచనాలతో ఈ సినిమాకు డిసెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది.
రెగ్యులర్గా హారికా హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను తీసుకునే డిస్ట్రిబ్యూటర్లకే ఈ సినిమాను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హారికా హాసిని బ్యానర్లో ఇటీవల విడుదలైన అల వైకుంఠపురములో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే క్రేజ్ను క్యాష్ చేసుకొని భారీ రేట్లకు అమ్మకుండా సినిమాను రీజనబుల్ రేట్లకే ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఆంధ్ర ఏరియా ఎనిమిది కోట్ల రేషియోలో ఇచ్చేసారట. నైజాం నాలుగున్నర కోట్ల వరకు పలికినట్టుగా తెలుస్తోంది. సీడెడ్ రెండు కోట్ల వరకు అమ్ముడైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 14 నుంచి 15 కోట్ల వరకు ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉండే కర్ణాటక, తమిళనాడు, ఓవర్ సీస్లు కలుపుకుంటే దాదాపు 20 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు.
ఇక ఈ ఏడాది నితిన్ పర్సనల్ లైఫ్లోనూ బిగ్ చేంజ్ కనిపించనుంది. ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అమెరికాకు చెందిన షాలినిని నితిన్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. ఇటీవల లాంఛనంగా పెళ్లి పనులు కూడా ప్రారంభించారు. వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో దుబాయ్లో జరగనుంది.