చిరంజీవితో సినిమా అంటే స్టార్ ప్రొడ్యూసర్లు కూడా క్యూలో నిలబడతారు. దర్శకులు ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ కాపీ కూడా చూడకుండానే అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. అది చిరంజీవి క్రేజ్ అంటే. కానీ ఇంత క్రేజ్ ఉన్న చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. కొన్ని స్టోరి డిస్కషన్ దశలోనే ఆగిపోతే ఓ రెండు సినిమాలు మాత్రం షూటింగ్ కూడా ప్రారంభమైన తరువాత అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆ సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.
శివ, క్షణ క్షణం, రంగీల సినిమాలతో ఇండియాను షేక్ చేస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ, చిరంజీవితో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేశాడు. చెప్పాలని ఉంది పేరుతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఒక పాట చిత్రీకరణ పూర్తయిన తరువాత ఆగిపోయింది. ఈ సినిమాకు ముందు వర్మ, సంజయ్ దత్ హీరోగా ఓ బాలీవుడ్ సినిమా కమిట్ అయ్యాడు. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే సంజయ్ దత్ జైలుకి వెళ్లటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో వర్మ, చిరంజీవి హీరోగా సినిమాను ప్రారంభించాడు. కానీ ఈ గ్యాప్లో సంజయ్ దత్ బెయిల్ మీద విడుదల కావటంతో ముందే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వర్మ, చిరు సినిమాను ఆపేసి సంజయ్ దత్తో సినిమాను రూపొందించేందుకు వెళ్లిపోయాడు. దీంతో చిరు సినిమా కొంత షూటింగ్ పూర్తయిన తరువాత అర్ధాంతరంగా ఆగిపోయింది.
చిరంజీవి హీరోగా ఓ హాలీవుడ్ సినిమా కూడా ఇలాగే ఆగిపోయింది. అబు బాగ్ధాద్ గజదొంగ పేరుతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్తో రూపొందించాలని ప్లాన్ చేసిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. అదే సమయంలో సినిమాలోని కటెంట్ పై లీగల్ సమస్యలు కూడా వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ కారణాలతో ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ సినిమా పూర్తయి ఉంటే ఈ మధ్య బాహుబలి సృష్టించిన చరిత్ర ఎన్నో ఏళ్ల క్రితమే చిరంజీవి సృష్టించి ఉండేవాడు.