మెగాస్టార్ చిరంజీవి.. పరిచయ అక్కర్లేని పేరు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనొక పర్వతం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివశంకర వర ప్రసాద్ తన నటనకు పునాదిరాళ్లు వేసుకుని స్వయంకృషితో చిరంజీవిగా ఎదిగారు. ఆయన జీవితం వడ్డించిన విస్తరికాదు. మొదట్లో ఎన్నో ఒడిదుడికులు, మరెన్నో విమర్శలు. కానీ, విమర్శలకు కృంగిపోకుండా.. పొగడ్తలకు పొంగిపోకుండా.. ఒక్కో నిచ్చెన ఎక్కుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగాడు. అప్పటికే మహామహులతో నిండిపోయిన తెలుగు సినీ ప్రపంచంలో తాను ‘విజేత’గా నిలిచారు.
అప్పటి వరకు మెలోడ్రామాతో సాగిన ఇండస్ట్రీకి అల్టిమేట్ డాన్స్ ను, ఫైట్స్ ను పరిచయం చేసి యువతను తనమైకంలో పడేసిన సుప్రీమ్ హీరో చిరంజీవి. అలాగే ఒక్కో సినిమా చిరు కెరీర్ ను ఒక్కో మలుపు తిప్పింది. అలాగే చిరంజీవి కెరీర్ లో 'ముటా మేస్త్రి' సినిమా ఎప్పటికీ నిలిచిపోయేలా హిట్ ని అందుకుంది.ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ ని అందుకోలేకపోయినా ఫాన్స్ నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కామాక్షి దేవికమల్ కంబైన్స్ బ్యానర్పై కె.సి.శేఖర్బాబు, డి. శివప్రసాద్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రోజా, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ లో చిరంజీవి డాన్స్ ని ఎవరూ మరిచిపోలేరు.
అలాగే ఈ సినిమాతో చిరంజీవి ముఠా మేస్త్రి నుంచి సీఎంగా ఎదుగుతాడు. అయితే ఈ చిత్రం తర్వాత నుంచీ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. ఇక ఇంద్ర, ఠాగూర్ సినిమాల తర్వాత ఈ ఊహాగానాలకు మరింత ఎక్కువ అయ్యాయి. అయితే అనుకున్నట్టుగానే చిరంజీవి క్రొత్తగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. 2008 ఆగస్టు 26 న తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఆ తర్వాత 2011, ఫిబ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. మళ్లీ సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.