నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ భీష్మ. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. అనంత్ నాగ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బోల్డ్ హీరోయిన్, కుమారి 21 ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ అతిథి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాపై హెబ్బా ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఒక్క ప్రమోషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా రాలేదు.
సినిమాలో హీరో పరిచయ సన్నివేశాల్లోనే హెబ్బా కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే చిన్న పాత్రే అయినా కథను మలుపు తిప్పే పాత్ర కావటంతో హెబ్బా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించింది. చిత్రయూనిట్ కూడా హెబ్బాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పాత్ర చేయించుకున్నట్టుగా ప్రచారం జరిగింది. మరి ఇంత చేసిన హెబ్బా ప్రమోషన్కు ఎందుకు రాలేదన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు హెబ్బా, భీష్మ చిత్రయూనిట్ మీద అలిగిందన్న టాక్ వినిపిస్తోంది.
హెబ్బా కోపానికి కారణం లేకపోలేదు. ఆమె మీద చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్లో చిత్రయూనిట్ తొలగించటంతో హెబ్బా హర్ట్ అయ్యిందట. అందుకే ఒక్క ప్రమోషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. హెబ్బాను తీసుకున్నప్పుడు ప్రమోషన్లో కూడా పాల్గొనాలని ఒప్పందం చేసుకున్నా.. చిత్రయూనిట్ తీరుతో హర్ట్ అయిన హెబ్బా ప్రచారానికి రానని తెగేసి చెప్పేసిందట. దీంతో చేసేదేమి లేక.. హెబ్బా పటేల్ లేకుండానే ప్రమోషన్ అంతా కానిచ్చేశారు చిత్రయూనిట్. ఒక వేళ హెబ్బా కూడా ప్రమోషన్లో పాల్గొని ఉంటే సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.